మహాశక్తి ఆలయంలో..
వైభవంగా శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
నాణేలు, తామర పువ్వులతో ప్రత్యేక అలంకరణ
దర్శించుకున్న జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్..
కరీంనగర్-జనత న్యూస్
కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మంగళవారం కాత్యాయని ( శ్రీ మహాలక్ష్మి) దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవార్లను ప్రత్యేకంగా నాణేలు, తామర పువ్వులతో అలంకరించారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తుల తాకిడితో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భవానీ మాత శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పేయి మహాశక్తి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ లకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందజేశారు. కాగా.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం బిజిబిజీగా గడిపారు. మొదట అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ కార్యక్రమాలు ముగిసాక ప్రజల సమస్యలు, వినతులు స్వీకరించారు. అభిమానులతో సెల్ఫీలు దిగారు.అనంతరం భవానీ భక్తులతో కలిసి బిక్ష చేశారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో దాండియా వేడుకలు ఘనంగా జరిగాయి.