అందుబాటులోకి మరో వంద పడకలు
ఆసుపత్రి ప్రాథమిక అవసరాలు తీర్చాలి
అధికారులకు మంత్రి పొన్నం ఆదేశాలు
కరీంనగర్-జనత న్యూస్
కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని బిసి సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆన్నారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సంఘ సమావేశం సోమవారం ఆసుపత్రి సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై మాట్లాడారు. ఆస్పత్రిలో ప్రాథమిక అవసరాలను వెంటనే తీర్చాలని, మాతా శిశు కేంద్రంలో మరో వంద పడకలు అందుబాటులోకి తేవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో డ్రైనేజీ సమస్యను 15 రోజుల్లోగా పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. ఆసుపత్రిలో సుమారు 150 ఏసీలు, పరికరాలు అవసరం ఉన్నాయని సూపరింటెండెంట్ కోరగా, ఏసీల ఏర్పాటు బాధ్యత తాను చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఆస్పత్రిలో అన్ని మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, పాడైపోయిన అంబులెన్స్ ల స్థానంలో రెండు కొత్త అంబులెన్సులు కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలుకు కొన్ని నిధులు ఉన్నాయని ఇంకా రూ.9 లక్షలు అవసరమని సూపరింటెండెంట్ తెలుపగా ఆ నిధులు జిల్లా కలెక్టర్ సమకూర్చాలని మంత్రి ఆదేశించారు. రోగులకు ఆర్ ఓ వాటర్ అందించాలని తెలిపారు. ఆస్పత్రిలో ఖాళీల వివరాలు సమర్పిస్తే భర్తీ కోసం తగు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆస్పత్రి అభివృద్ధికి అందరూ కలిసి రావాలని, ఎవరైనా ఆస్పత్రి అభివృద్ధికి విరాళాలు ఇవ్వవచ్చని కోరారు. ఈ సమావేశంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పెయి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ పాల్గొన్నారు.