కాగ్రెస్ ప్రభుత్వ మీనమేషాల్లో ఆంతర్యం ?
బీఆర్ఎస్ కార్పోరేటర్, మాజీ మేయర్ ఫిర్యాదు
స్మార్ట్సిటీ నిధుల్లో అవినీతిపై సర్వత్రా చర్చ
జంక్షన్ల అభివృద్ధి పనులపైనా అనేక అనుమానాలు
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
కరీంనరగ్ స్మార్ట్సిటీ నిధుల కేటాయంపుల్లో జరిగిన అవినీతెంత..? అక్రమాలకు పాల్పడ్డది కేవలం అధికారులేనా..మేయర్ పాత్ర లేదా ? నిబంధనలకు విరుద్దంగా చేపట్టిన పనులపై హైకోర్టు ఆదేశాలతో వన్టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుపై విచారణ చేపడుతారా..? దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం స్తబ్దంగా ఉండడంలో ఆంతర్యమేంటి..? బీఆర్ఎస్ అదిష్టానం మద్దతుతోనే మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ అదే పార్టీకి చెందిన మేయర్ సునిల్ రావుపౖౖె పోరాడుతున్నారా..? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాదానాలు రావాల్సి ఉంది.
కరీంనగర్ స్మార్ట్సిటీ నిధుల కేటాయింపుల్లో అవక తవకలపై వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంఛలనం రేపింది. బీఆర్ఎస్కు చెందిన మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ అదే పార్టీకి చెందిన మేయర్ సునిల్ రావుపై అనేక ఆరోపనలు చేయడం, అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించడం సర్వత్రా చర్చకు దారి తీసింది. ఇది అటు బీఆర్ఎస్లో..ఇటు కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో దూమారం రేపుతోంది. మున్సిపల్ ఎన్నికలకు కొద్ది కాలం ముందు స్మార్ట్సిటీ అక్రమాలు, అవినీతి ఆరోపనలు, కేసు నమోదు కావడం..ఎటు వైపు దారి తీస్తుందోనని పలువరు భావిస్తున్నారు.
ఎఫ్ఐఆర్ నమోదు ఇలా..
నిబంధనలకు విరుద్దంగా స్మార్ట్సిటీ నిధులను పంచాయతీ పరిధిలోని అభివృద్ధి పనులకు కేటాయించారని, ఇందులో భారీగా అవినీతి జరిగిందని మాజీ మేయర్, మున్సిపల్ కార్పోరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ ఆరోపన. దీనిపై జూలై 3న వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు పట్టించుకోక పోవడంతో హైకోర్టును ఆశ్రయించారు రవీందర్ సింగ్. న్యాయ సూత్రాలు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 లను ఉల్లంఘించారని కోర్టుకు వివరించడంతో క్రిమినల్ కేసుకు ఆదేశించింది న్యాయ స్థానం. దీంతో కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు క్రైం నంబర్ 480/2024 సెక్షన్ 420, 406 ప్రకారం కేసు నమోదు చేశారు. ఇందులో స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కరీంనగర్ మునిసిపల్ కమిషనర్, ప్రాజెక్టు ఎస్ఈ , మేనేజ్ మెంట్ కన్సల్టెన్సీ మేనిజింగ్ డైరక్టర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఎఫ్ఐఆర్కు దారి తీసిన అంశాలు..
2017`18 సంవత్సరంలో కరీంనగర్ స్మార్ట్సిటీకి ఎంపిక కాగా..ఇందుకు సిబంధించిన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. రూ.1878 నిధుల్లో రిట్రో ఫిటింగ్, కాంటిజెన్సీ, ప్యాన్సిటీ..తదితర పనులు చేపట్టాల్సి ఉంది. అప్పటి 50 డివిజన్లలోని 31 డివిజన్లలో 23.85 కిలోమీటర్ల పరిధిలో నిర్ధేశించిన డివిజన్లలో మాత్రమే ఈ పనులు చేపట్టాల్సి ఉంది. కాని..ఇందుకు విరుద్దంగా బొమ్మకల్ పంచాయతీ పరిధిలో రూ. రెండు కోట్లతో జంక్షన్ అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో పాటు రేకుర్తి తదితర ప్రాంతాల్లో కూడా స్మార్ట్సిటీ నిధులతో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారని మాజీ మేయర్ రవీందర్ సింగ్ అనేక సార్లు ఆరోపించారు. ఫిర్యాదులు కూడా చేశారు. చివరకు కోర్టు మెట్లెక్కారు.
కూడళ్ల అభివృద్ధి పనులపై విచారణ ?
నగరంలోని తెలంగాణ చౌరస్తా, కమాన్, కోర్టు చౌరస్తా, బద్దం ఎల్లారెడ్డి చౌరస్తా, నాకా చౌరస్తా, వన్టౌన్ చౌరస్తా..అభివృద్ధి పనుల్లో భారీ అవక తవకలు జరిగినట్లు ఆరోపనలున్నాయి. ఒక్కొక్క చౌరస్తాకు పలు మార్లు నిధులు కేటాయించి అభివృద్ధి పనుల చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇందులో కూడా భారీగా అవినీతి జరిగిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఒక సందర్భంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పాటు నిబంధనలకు విరుద్దంగా కోవిడ్ సమయంలో రోడ్డు నిర్మాణం పనులు నాసిరకంగా చేపట్టి బిల్లులు పొందారని, మాజీ మేయర్ రవీందర్ సింగ్ గతంలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వీటిపై కూడా సమగ్ర విచారణ చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
విచారణపై కాంగ్రెస్ ప్రభుత్వ స్టాండ్ ?
బీఆర్ఎస్ మాజీ మేయర్ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు కాగా..దీనిపై చేపట్టే విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొద్ది కాలంలో మున్సిపల్ ఎన్నికలు కూడా రానున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే చర్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్పై మేయర్ సునిల్ రావు తీవ్ర ఆరోపనలు చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నప్పటికీ..కార్యాచరణలో చూపడం లేదనే అనుమానాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో స్మార్ట్సిటీ నిధులపై నమోదైన ఎఫ్ఐఆర్పై సమగ్ర విచారణ చేపడుతుందా..? లేక స్తబ్ధంగా ఉంటుందా..? అనేది తేలాల్సి ఉంది.