రెండో రోజు కొనసాగిన విచారణ
పలు లోపాలు గుర్తించినట్లు సమాచారం
వేములవాడ-జనత న్యూస్
ప్రముఖ పుణ్యక్షేత్ర మైన వేములవాడ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలోని పలు విభాగాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ విచారణలో పలు అంశాల్లో లోపాలు గుర్తించినట్లు తెలుస్తుంది. ఏబీసీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో గురు, శుక్రవారాల్లో ఈ తనిఖీలు కొనసాగాయి. అడ్మినిస్ట్రేషన్లోని పలు విభాగాల్లోని రిజిస్ట్రర్లు తనిఖీ చేసి, సంబంధిత అధికారుల నుండి సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఆలయంలో వివిధ దుకాణాలకు టెండర్ల ఖరారు, ఆదాయ, వ్యయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే దేవాలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదానం లో కూడా పలు రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలించారు. ప్రతిరోజు ఎంతమందికి భోజనాలు పెడుతున్నారని ఆరా తీశారు. ఇక్కడి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. లడ్డూ తయారీ, టికెట్ల అమ్మకాలు తదితర అంశాల్లో ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో దాడులు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ రమణ మూర్తి తెలిపారు. ఆయా విభాగాల్లో విచారణ చేపట్టి, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు. తూనికలు కొలుతలు, ఫుడ్ సేఫ్టీ, ఆడిటింగ్ విభాగ అధికారులతో కలసి ఈ దాడులు చేసినట్లు ఆయన తెలిపారు.
వేములవాడ ఆలయంలో ఏసీబీ తనిఖీలు..
- Advertisment -