బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి
రాయికల్, జనతా న్యూస్:ప్రజా సమస్యల పోరాటంలో అలుపెరుగని శ్రామికులు జర్నలిస్టులని, సమాజ సేవలో మీడియా పాత్ర అనిర్వచనియమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి అన్నారు. రాయికల్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ జేఏసీ కార్యాలయంలో జర్నలిస్టులతో మంగళవారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల ప్రెస్ క్లబ్ జేఏసీ నూతన కమిటీ సభ్యులను ఆమె ఘనంగా సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ, ప్రజా సమస్యలపై నిరంతరం తమ కలంతో గన్ను లాగా ఎక్కుపెట్టి, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఏకైక కలం వీరులు జర్నలిస్టులని, వారి సేవలు అభినందనీయం అన్నారు. కరోనా కష్టకాలంలోనూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, ప్రజా శ్రేయస్సు కోసం అధికారులను, ప్రభుత్వాన్ని అప్రమత్త చేస్తూ పోరాడిన యోధులు జర్నలిస్టులని ఆమె అన్నారు. పార్టీలకతీతంగా పాత్రికేయ పరస్పర సహకారంతో నడిచినప్పుడే సమాజ శ్రేయస్సు కలుగుతుందని ఆమె అన్నారు. మండల పాత్రికేయుల సహకారం తమపై ఎల్లప్పుడూ ఉండాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఎంపీ అరవింద్ దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జేఏసీ అధ్యక్షులు వాసవి రవి, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్, కోశాధికారి మచ్చ శేఖర్, ఉపాధ్యక్షులు చింతకుంట సాయికుమార్, సాంస్కృతిక కార్యదర్శి పెద్దండి ముత్యపు రాజు రెడ్డి, నిజనిర్ధారణ కమిటీ సభ్యులు సింగిడి శంకరయ్య, రసూల్, శ్యాంసుందర్, పాత్రికేయులు లింబాద్రిగౌడ్, ప్రవీణ్, జితేందర్, మహేష్, బిజెపి పట్టణ అధ్యక్షులు కల్లెడ ధర్మపురి, సీనియర్ నాయకులు కురుమ మల్లారెడ్డి, కుంబోజి రవి, సామల్ల సతీష్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.