వీధి కుక్కల దాడుల నియంత్రణకు చర్యలు..
ప్రత్యేక ఏజెన్సీతో ఏబీసీ, ఏఆర్వీ..
నేటి నుండి ప్రక్రియ షురూ..
కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ చొరవ..
మిగతా ప్రాంతాల్లో కదలని యంత్రాంగం
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
వీధి కుక్కల దాడులతో ప్రజలు భయ బ్రాంతులకు గురౌతున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర హైకోర్టు సైతం పలు మార్లు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో ఎనిమల్ బర్త్ కంట్రోల్, ఆంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇప్పించేందుకు చర్యలు చేపట్టింది మున్సిపల్ శాఖ. కరీంనగర్ నగర పాలక సంస్థలో సైతం ఇంఛార్జి కమీషనర్ ప్రపుల్ దేశాయ్ చొరవతో..శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్లో వీధి కుక్కల దాడుల నియంత్రణకు చర్యలు చేపట్టింది యంత్రాంగం. ఆయా ప్రాంతాల్లోని వీధి కుక్కలను పట్టుకుని కుటుంబ నియంత్రణ ఆపరేషన్తో పాటు ఆంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇప్పించేందుకు చర్యలు తీసుకుంది. నిర్వహణా బాధ్యతను స్వతంత్ర ఎనిమల్ సొసైటీకి అప్పగించింది మున్సిపల్ కార్పోరేషన్. ఆయా డివిజన్ల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు డాగ్ క్యాచర్స్ వీధి కుక్కలను పట్టుకుని..జంతు రంక్షణ కేంద్రంలో ఏబీసీ, ఏఆర్వీ చేపడుతారు.
కరీంనగర్లో సుమారు పది వేల వరకు వీధి కుక్కలు ఉన్నట్లు అంచన. ఇందులో 2022లో వెయ్యికి పైగా వీధి కుక్కలను పట్టుకుని కు.ని ఆపరేషన్ చేసి వదిలి పెట్టారు. మరో మరో 8 నుండి తొమ్మిది వేల వరకు ఆయా డివిజన్లలో కుక్కలున్నట్లు అధికారులు అంచనా వేశారు. స్వతంత్ర ఏజెన్సీ ద్వారా గతంలో తరహా బర్త్ కంట్రోల్, వ్యాక్సిన్ ఇచ్చేలా తాజాగా చర్యలు చేపట్టారు. ఆయా డివిజన్ల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు వీధి కుక్కలను క్యాచర్స్ పట్టుకుని వాహనం ద్వారా జంతు సంరక్షణ కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఇందుకు గాను ఈ కేంద్రంలో ఐదుగురు డాగ్ క్యాచర్స్, వెటర్నరీ డాక్టర్, మరో ఇద్దరు ప్యారామెట్స్ అందుబాటులో ఉంచారు. వీధి కుక్కలను ఐదు రోజుల పాటు తమ ఆదీనంలో ఉంచుకుని..ఆరోగ్యంగా ఉందని నిర్ధారించాకే వీధుల్లో వదలి పెడతారు. ఇందుకు గాను ఒక్కో శునకానికి రూ. 1600 చొప్పున మున్సిపల్ చెల్లిస్తుంది.
ఇప్పటికే అనేక ఫిర్యాదులు..
నగరంలో కుక్కల బెడదపై ఇప్పటికే 60 వరకు ఫిర్యాదులు వచ్చాయి. జ్యోతినగర్, రేకుర్తి, పద్మనగర్ తదితర ప్రాంతాల నుండి ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని కుక్కలను పట్టుకుని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆదివారం నుండి ఈ ప్రక్రియ ప్రారంభించనున్నారు. అయితే..కొద్ది రోజులు మొక్కుబడిగా కాకుండా నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకుంటే..లక్ష్యం నెరవేరుతుంది.
మిగతా ప్రాంతాల్లో స్పందన కరువు
ఉమ్మడి జిల్లాలో కరీంనగర్లో ఏబీసీ, ఏఆర్వీ ప్రక్రియ చేపట్టారు. మిగతా పట్టణాలు, వీధి కుక్కల బెడద ఉన్న గ్రామాల్లో ఎలాంటి నియంత్రణా చర్యలు తీసుకోవడం లేదు. బడ్జెట్, ఇతరాత్ర కారణాలతో మున్సిపల్, పంచాయతీ అధికారులు స్తబ్ధంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. వీటిపై ఆయా జిల్లాల యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఫిర్యాదులొస్తే పట్టుకుంటాం
రామకృష్ణ, మేనేజర్ స్వతంత్ర ఏజెన్సీ
కుక్కల బెడద ఉన్నట్లు మున్సిపల్ సిబ్బంది నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు ఆయా ప్రాంతాలకు తమ సిబ్బంది వెల్లి వాటిని పట్టుకుని జంతు సంరక్షణ కేంద్రానికి తరలిస్తారు. ఇక్కడ వాటిని అబ్జర్వేషన్లో పెట్టుకుని బర్త్ కంట్రోల్ ఆపరేషన్తో పాటు ఆంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇచ్చి..ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించాకే తిరిగి ఆయా వీధుల్లో వదిలి పెడుతాం. ఈ కేంద్రంలో స్థలం సరిపోవడం లేదు. బొమ్మకల్లో ప్రభుత్వం ఎకరం స్థలాన్ని ఇందు కోసం కేటాయించింది. అక్కడ పర్మినెంట్ సెంటర్ను ఏర్పాటు చేయిస్తే..మరింత వెసులుబాటు ఉంటుంది.
కుక్కలతో ఆటలొద్దు
డాక్టర్ రామస్వామి, ఏడీ, జంతు సంరక్షణ కేంద్రం
కుక్కలు, కోతులతో చిలిపి చేష్టలు చేస్తుంటారు కొందరు. మరికొందరు కళ్లలో కళ్లు పెట్టి చూస్తారు. రాళ్లలో కొడుతారు. వీటివల ్ల అవి కరిసే ప్రమాదాలుంటాయి ,చిన్న పిల్లలను రోడ్డుపై ఒంటరిగా పంపవద్దు. కొన్ని సందర్భాల్లో వీధి కుక్కలు అహారం దొరకక, ఇతరాత్ర కారణాల వల్ల దాడులు చేస్తున్నాయి. వీధి కుక్కల దాడుల నియంత్రణకు మున్సిపల్ కార్సోరేషన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.