స్మార్ట్సిటీ పనులపై విచారణ ?
మంత్రి పొన్నంకు కాంగ్రెస్ మాజీ కార్పోరేటర్ల వినతి
నేడు టీపీసీసీ లీగల్ సెల్ సమావేశం
న్యాయ నిపుణులతో చర్చించనున్న నేతలు
కరీంనగర్-జనత న్యూస్
నగర మేయర్ సునిల్ రావుకు ఉచ్చు బిగుసుకునే అవకాశాలున్నాయి. ‘విజిలెన్స్, ఈడీ, సీబీఐ..ఏ విచారనైనా చేసుకో’ అని మేయర్ సవాల్ విసిరిన నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ కార్పోరేటర్లు స్పందించి, స్మార్ట్సిటీ పనులపై విచారణ చేయాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరారు. గత కొంత కాలంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో..ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం.
విచారణకు కాంగ్రెస్ నేతల వినతి
కరీంనగర్ స్మార్ట్సిటీ పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ను కాంగ్రెస్ మాజీ కార్పోరేటర్లు కోరారు. మేయర్ సునిల్ రావు చేసిన సవాల్పై స్పందించిన నేతలు.. నగరంలోని ఓ ప్రయివేటు హోటల్లో సమావేశ మయ్యారు. మాజీ కార్పోరేటర్లు మెండి చంద్ర శేఖర్, ఆకుల ప్రకాష్, గంట శ్రీనివాస్, వైద్యుల అంజన్ కుమార్, ఆకుల నరసయ్య, కాశిట్టి శ్రీనివాస్, పడిశెట్టి భూమయ్యలు చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నగరంలో అభివృద్ధి పనుల పేరుతో మేయర్ సునిల్ రావు భారీ అవినీతికి పాల్పడ్డారని, వాటిపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.
మేయర్పై ఇవీ ప్రధాన ఆరోపనలు..
నగరంలోని కిసాన్ నగర్ ఇంటిగ్రెడ్ మార్కెట్ షెడ్ల తొలగింపు పనుల్లో.. బిల్లుల పేరుతో రూ. 80 లక్షలు, గాంధీ రోడ్, తెలంగాణ చౌరస్తా అభివృద్ధి పనుల్లో భారీగా అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మల్టీ పర్పస్ పార్కు అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్తో కుమ్మకై అంచనాలు రెట్టింపు చేసి దోచుకున్నారట. రేకుర్తిలో పది గుంటల శ్మశాన వాటిక భూమి కబ్జా, అపార్ట్మెంట్ల నిర్మాణ అనుమతులకు రూ. ఐదు లక్షల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
నేడు టీపీసీసీ లీగల్ సెల్ సమావేశం
కరీంనగర్ డీసీసీ ఆఫీసులో గురువారం టీపీసీసీ లీగల్ సెల్ సమావేశం జరుగనుంది. ఆ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పొన్నం అశోక్ గౌడ్ న్యాయవాదులతో సమావేశం కానున్నారు. స్మార్ట్సిటీ పనుల్లో అవినీతి ఆరోపనలు, ఇతర శాఖల్లోని అక్రమాలపై ఇందులో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా మేయర్ సునిల్ రావు రాష్ట్ర మంత్రి పొన్నంపై చేసిన తీవ్ర ఆరోపనలపై చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రభుత్వ అనుమతితో ఏ విచారణ చేపట్టాలనే దానిపై ఇందులో చర్చించే అవకాశాలున్నాయి.