- 2,500 ఆర్టీసీ కొత్త బస్సులు, 3050 పోస్టులకు..
ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ప్రతీ మండలం నుండి రాజధానికి బస్సు
పాలక వర్గ సన్మాన సభలో మంత్రి పొన్నం
కరీంనగర్`జనత న్యూస్
త్వరలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేయనున్నామని, టీఎస్ పీఎస్పీ ద్వారా పారదర్శకంగా నియామకాలు చేపట్టనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జడ్పీ హాలులో పాలక వర్గ సన్మాన సభకు ఆయన హాజరై మాట్లాడారు. ఆర్టీసీలో మూడు వేలా పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని..వీటిని టీఎస్ పీఎస్సీ ద్వారా నియామకాలు చేపడుతామన్నారు. రానున్న రోజుల్లో ఆర్టీసీ సంస్థ ద్వారా 2,500 బస్సులను కొనుగోలు చేయనున్నామని..ప్రతీ మండలం నుండి రాజధానికి ఆర్టీసీ బస్సును నడుప నున్నట్లు చెప్పారు. 33 జిల్లాల నుండి హైదరాబాద్కు ఏసీ బస్సులను నడుపుతామన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల 100 శాతం ఆక్యుపెన్సీ పెరిగిందని..ఆర్టీసీ నష్టాల భారి నుండి బయట పడుతోందన్నారు. పీఎఫ్, బ్యాంకు అప్పుల్లో ఇప్పటికే 80 కోట్లు చెల్లించామని, మరో 200 కోట్ల బకాయిలు కూడా చెల్లిస్తామన్నారు. కారుణ్య నియామకాలు, కొత్త ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
జడ్పీ పాలక వర్గానికి ఘన సత్కారం
కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో 2019 నుండి 24 వరకు పదవి బాధ్యతలు పూర్తి చేసుకున్న జడ్పీ ఛైర్ పర్సన్, జడ్పీటిసి, ఎంపిపి లకు ఆత్మీయ సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ , రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ గణపతి, వైస్ చైర్మన్ పెరాల గోపాల్ రావు , జడ్పీటిసి, ఎంపిపి లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాలక వర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సహృద్భావ వాతావరణంలో కలిసి పనిచేస్తున్నామని, ఏ సమస్య ఉన్న పార్టీలకు అతీతంగా ఓపెన్ గా చెప్పుకోవచ్చని సూచించారు. భవిష్యత్తో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు.