- మాఘమాసం నాడు నిర్వహణకు ఏర్పాట్లు
- ప్రతాప రుద్రుడి కాలం నుంచి భక్తులు రాక
- ప్రాచీన ఆనవాళ్లు.. ఘనమైన చరిత్ర
Singaraya Jatara : సిద్ధిపేట, జనత న్యూస్: పచ్చని చెట్లు.. ఎత్తైన కొండలు.. మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చే మోయతుమ్మెద సెలయేరు.. వీటి మధ్యన కొలువుదీరాడు లక్ష్మీనరసింహస్వామి. ఈ ప్రదేశం ఎక్కడో కాదు… సిద్ధిపేట జిల్లాలో ఉంది. ప్రతీ ఏటా మాఘమాసం రోజున లక్షలాది మంది భక్తులు సిద్ధిపేట, కరీంనగర్ ,రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, వరంగల్ జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శంచుకుంటారు. అయితే ఇక్కడ స్వామివారు అందమైన గుడిలో కాకుండా కొండగుహలో దర్శనమవివ్వడం ప్రత్యేకత సంతరించుకుంది. 2024లో ఫిబ్రవరి 9న సింగరాయ జాతర జరనుంది. ఈ సందర్భంగా ఏర్పాట్లు పూర్తి చేశారు.
సింగరాయ కొండ అని పేరెలా వచ్చిందంటే?
సిద్ధిపేట జిల్లాలోని కోహెడ మండలం కూరెళ్ల గ్రామంలో మోయతుమ్మెద వాగు ఒడ్డున ఉన్న గుట్టపై స్వామివారు స్వయంభూగా వెలిశారు. కాకతీయుల కాలంలో ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలో అనేక కట్టడాలు నిర్మించారు. ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్రుడు మోయతుమ్మెద వాగుపై భారీ చెరువును నిర్మించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో అనువైన స్థలాన్ని పరిశీలించడానికి సింగరాయ అనే వాస్తు శిల్పిని పంపించాడు. అయితే కూరెళ్ల గ్రామ సమీపంలోకి రాగానే ఇక్కడి ప్రకృతి అందాలను చూసి ఆయన మురిసిపోయాడు. అంతేకాకుండా అక్కడే కొండగుహలో వెలిసిన నరసింహాస్వామిని దర్శించుకొని అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. ఆ తరువాత ఈ కొండకు సింగరాయ కొండ అని నామకరణం చేసి.. ప్రతీ మాఘమాసంలో జాతరను నిర్వహిస్తున్నారు.
తండోపతండాలుగా భక్తులు..
ప్రతీ మాఘమాసంలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడున్న లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకోవడంతో పాటు అమావాస్య రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే గడుపుతారు. అయితే రాత్రి సమయంలో స్వామి వారు అలసిపోతారని భావించి చీకటిపడగానే ఆలయాన్ని మూసేస్తారు. దీంతో భక్తులు ఇక్కడే వండుకొని ఒకరోజు నిద్రిస్తారు. అయితే ఇక్కడ మాంసాహారానకి అవకాశం లేదు. కేవలం శాఖాహాం మాత్రమే తినాలని అంటారు.
ఎలా వెళ్లాలి?
సింగరాయకొండకు వెళ్లాలంటే కొహెడ నుంచి కూరెళ్ల వరకు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ప్రైవేట్ వాహనాల్లో ఇక్కడికి వెళ్లొచ్చు. అయితే గుట్టపైకి వెళ్లాలంటే మాత్రం ఎవరైనా 2 కిలోమీటర్లు నడవాల్సిందే. కూరెళ్ల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ జాతర సాగుతుంది. క్యూలైన్లు, వాహనాల పార్కింగ్, దుకాణాల ఏర్పాటు కు సంబంధించి పంచాయితీ ఆధ్వర్యంలో సాగుతాయి. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఏర్పాట్లు చేస్తారు.
ప్రాచీన చరిత్ర ఆనవాళ్లు..
సింగరాయ కొండపై ఆదిమానవులు నివసించిన ఆనవాళ్లు ఉన్నాయని కొందరు చెబుతారు. స్వామివారిని దర్శించుకొని వచ్చే క్రమంలో ఆంజనేయుడు, కాలబైరవుడి విగ్రహాలు కనిపిస్తాయి. అలాగే స్వామి వారు కొలువైన ప్రదేశంలో ప్రాచీన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి. బౌద్ధ మతానికి సంబంధించిన చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం, గాజు పరిశ్రమ అవశేషాలు ఇక్కడ లభించాయి.