చేనేత దినోత్సవం కానుక ?
రాష్ట్ర వ్యాప్తంగా రూ. 100 కోట్ల వరకు మాఫీ
సహకార సంఘాల క్యాష్ క్రెడిట్..
ముద్ర లోన్స్ మాఫీ అయ్యే అవకాశాలు
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
తెలంగాణలో అత్యంత గడ్డు పరిస్థితుల్లో కొట్టు మిట్టాడుతున్న చేనేత పరిశ్రమకు జవసత్వాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు గాను కీలక నిర్ణయం తీసుకోనుంది. అప్పుల ఊభిలో కొట్టుమిట్టాడుతున్న చేనేత సహకార సంఘాలు, కార్మికులకు రుణ విముక్తి కల్పించే ఆలోచన చేస్తుంది సర్కారు. ఇప్పటికే రైతు రుణమాఫీ ప్రకటించిన ప్రభుత్వం..తాజాగా చేనేత రుణమాపీ ప్రకటించనున్నట్లు విశ్వస నీయ సమాచారం. ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సం నాడు ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే పలువురు మంత్రులు, అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
యాంత్రీకరణ విస్తరిస్తోన్న పరిస్థితుల్లో చేనేత పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. శతాబ్ధాల చరిత్ర గల, చారిత్రాత్మక చేనేత రంగం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. పోటీ ప్రపంచంలో వస్త్రోత్పత్తి, మార్కెటింగ్..కార్మికులకు సవాల్గా మారింది. ప్రభుత్వాలు కొంత రాయితీలు, స్కీమ్లు ప్రకటించినా..పరిశ్రమ గట్టెక్కడం లేదు. చేనేత కార్మికులు, సహకార సంఘాల పరిరక్షణ..ప్రభుత్వ బాధ్యత. ఈ పరిస్థితుల్లో పరిశ్రమకు భారంగా మారిన బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా చేనేత రుణమాఫీ ప్రకటించాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ నెల 1న హైదరాబాద్లో చేనేత జౌళిశాఖ అధికారి రిటైర్మెంట్ ఫంక్షన్లో నకిరెకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం..ప్రభుత్వ రుణమాఫీ ఆలోచనను కార్మికులతో పంచుకున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 314 వరకు చేనేత సహకార సంఘాలు పని చేస్తున్నాయి. మరో వంద సంఘాల వరకు అప్పులు, ఆర్థిక భారంతో మూత పడ్డాయి. చేనేత సహకార సంఘాలు..ఆయా సహకార బ్యాంకుల్లో క్యాష్ క్రెడిట్ రూపేనా అప్పులు తీసుకుంటాయి. ముడిసరుకుల కొనుగోళ్లు, కార్మికులకు కూల్లు, ఇతర నిర్వహణకు బ్యాంకుల నుండి అప్పు తీసుకుంటారు పాలక వర్గాలు. వాటికి రాష్ట్ర ప్రభుత్వం పావలా వడ్డీ చెల్లిస్తుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ. 50 నుండి 70 కోట్ల వరకు బ్యాంకుల్లో చేనేత సంఘాల రుణాలు ఉంటాయని అంచన. వీటితో పాటు చేనేత కార్మికులు వ్యక్తిగత వృత్తి పరంగా ముద్ర రుణాలు తీసుకున్నారు. తీసుకున్న రుణాలు అనేక కారణాలతో తిరిగి చెల్లించలేక పోయారు. దీంతో బ్యాంకుల్లోని అప్పుల భారం.. సహకార సంఘాలకు, నేతన్న లకు భారంగా మారాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కల్పిస్తే..చేనేత పరిశ్రమకు ఊపిరి పోసినట్లు ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుత ప్రభుత్వం రుణమాఫీ చేస్తే..చేనేత పరిశ్రమతో పాటు సుమారు 70 వేల కుటుంబాల మనుగడ సాధించే అవకాశాలుంటాయి.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రూ. 7 కోట్లు
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 36 చేనేత సహకార సంఘాలు నడుస్తున్నాయి. మరో పది సంఘాలు మూత పడ్డాయి. ఆయా ప్రాంతాల్లోని సహకార బ్యాంకుల్లో సుమారు రూ. 7 కోట్ల వరకు పాలక వర్గాలు రుణాలు తీసుకున్నాయి. వీటితో పాటు వృత్తి రీత్యా చేనేత కార్మికులు పెట్టుబడి కోసం ఇతర బ్యాంకుల్లో ముద్ర రుణాలు తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత రుణ మాఫీ ప్రకటిస్తే..సహకార రంగ కార్మికులతో పాటు ఇతర చేనేత కార్మికులకు మేలు జరిగే అవకాశాలున్నాయి.
2004లో అప్పటి వైఎస్ ప్రభుత్వం రుణమాఫీ
2004లో ఉమ్మడీ ఏపీలో అప్పటి వైఎస్ ప్రభుత్వం రూ. 327 కోట్ల చేనేత రుణమాలు మాఫీ చేసింది. దీంతో అప్పుడు మూడు లక్షల మంది చేనేత కార్మికులకు మేలు జరిగింది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికి రూ. 100 కోట్లలోపు నిధులు మాత్రమే సరిపోతాయి. రుణమాఫీ ప్రకటించడంతో పాటు.. ఏడేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.