వీసీ నియామకమెప్పుడు ?
కుంటుపడ్డ అభివృద్ధి
ఇప్పటికే ప్రారంభమైన విద్యా సంవత్సరం
24 నుండి బడ్జెట్ సమావేశాలు..
నిధుల కేటాయింపుపై అనుమానాలు
కరీంనగర్-జనత న్యూస్
ఉన్నత విద్యపై కాంగ్రెస్ సర్కారు దృష్టి సారించినట్లు కనబడడం లేదు. యూనివర్సిటీల్లో మౌళిక వసతులు, నిధుల కేటాయింపు, కొత్త కోర్సుల ఏర్పాటు..ఇతర అభివృద్ధిపై చర్యలేవీ చేపట్టడం లేదు. కనీసం వీసీల నియామకాలు చేపట్టక పోవడంతో..ఆయా యూనివర్సిటీలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇందులో శాతవాహన యూనివర్సిటీపై ఆది నుండి వివక్షే కొనసాగుతున్నట్లు స్ఫష్టమౌతుంది. ప్రస్తుతం వీసీ నియామకాలకు ఎలాంటి అడ్డంకులు లేకున్నా..ఆ ప్రక్రియ చేపట్టక పోవడం పట్ల విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుత ఇంఛార్జి వీసీతో అభివృద్ధి కుంటు పడిరదనే ఆరోపనలున్నాయి.
తెలంగాణలోని యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్ల పదవీ కాలం పూర్తి కాగా..ఇంఛార్జి వీసీలుగా ఐఏఎస్ అధికారులు కొనసాగుతున్నారు. కరీంనగర్ శాతవాహణ యూనివర్సిటీకి ప్రొఫెసర్ మల్లేశ్ తరువాత ఇంఛార్జి వీసీగా సురేంద్ర మోహన్ నియమితులయ్యారు. ఎన్నికల కోడ్, సెర్చ్ కమిటీ సమావేశం కాక పోవడంతో 40 రోజుల క్రితం ఇంఛార్జి వీసీలను ప్రభుత్వం నియమించింది. 2008లో ప్రారంభమైన శాతవాహన యూనివర్సిటీకి మొదటి వీసీగా ప్రొఫెసర్ మహ్మద్ ఇక్భాల్ అలీ..ఆ తరువాత ప్రొఫెసర్ వెంకట్రాజం.. ప్రోఫెసర్ వీరారెడ్డి పూర్తి స్థాయి వీసీలుగా పని చేశారు. స్వరాష్ట్రంలో ఇంఛార్జి వీసీలుగా ఐఏఎస్ అధికారులు జనార్ధన్ రెడ్డి, చిరంజీవులు కొనసాగారు. ఆ తరువాత శాతవాహన యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ మల్లేశం బాధ్యతలు చేపట్టి..మూడేళ్ల పదవీ కాలం పని చేశారు.
158 మందిలో ఛాన్స్ ఎవరికి..?..ఎప్పుడు ?
శాతవాహన యూనివర్సిటీ వీసీ పదవి కోసం 158 దరఖాస్తులు వచ్చాయి. సెర్చ్ కమిటీ సమావేశమై ఒక్కో వర్సిటీకి 4 గురిని ఎంపిక చేసి, గవర్నర్కు నివేదించాల్సి ఉంది. ఇందులో ఒకరిని గవర్నర్ నియమించే అవకాశాలుంటాయి. కాని ఈ ప్రక్రియ చేపట్టక పోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వీసీ నియామకం ఎప్పుడు చేపడుతారనే చర్చ జరుగుతోంది. కాగా..ఇప్పటి వరకు ముస్లిం మైనార్టీ, రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వీసీలు నియామకం కాగా..ఈ సారి బీసీని నియమించాలని బీసీ సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేస్తుంది.
కుంటుపడ్డ అభివృద్ధి :
శాతవాహన యూనివర్సిటీలో మొట్ట మొదటిగా ప్రొఫెషనల్ కోర్సులు ప్రవేశ పెట్టారు. ఇదే ప్రాంగనంలో 2009లో బీ`ఫార్మసి కోర్సును ప్రారంభించారు. 2019 యూనివర్సిటీ స్నాతకోత్సవంలో భవన నిర్మాణాన్ని అప్పటి గవర్నర్చే భవన శంకుస్తాపన చేయిస్తారని ఆశగా ఎదురు చూసిన విద్యార్థులకు నిరాశే ఎదురైంది. ఇక కోర్సుల విషయానికొస్తే..ఎంకామ్..ఎంబీఏ.. ఎంఏ..ఎంఎస్సీ కోర్సులున్నాయి. ప్రస్తుతం 12 కోర్సులగా..22 డిపార్ట్మెంట్లుగా కొనసాగుతున్నాయి. ఇందులో తెలుగు మీడియంతో పాటు ఉర్దూ మీడియం కోర్సులు నిర్వహిస్తున్నారు. సోసియాలజీ, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్టీష్, ఎంఎస్సీ బాటనీ, మాథ్స్ కోర్సులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు ఏర్పాటు చేయలేక పోవడం వల్ల విదార్థులు పట్టాలు తీసుకునే వరకే పరిమితమయ్యారు. ప్రధానంగా నేషనల్, ఇంటర్నేషనల్లో డిమాండ్ ఉన్న ఇంజనీరింగ్ కోర్సులను ఏర్పాటు చేయక పోవడం పెద్ద మైనస్. వీటితో పాటు వివిధ విభాగాల్లో ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టాల్సి ఉంది.
బడ్జెట్లో ప్రత్యేక నిధులు లేనట్లేనా..?
గత బీఆర్ఎస్ సర్కారు శాతవాహణ వర్సిటీపై నిర్లక్ష్యం వహించిందని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత మంత్రి పొన్నం సైతం పలు మార్లు శాతవాహన వర్సిటీ సమస్యలను గుర్తు చేశారు. అయితే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యూనివర్సిటీకి నిధులు కేటాయిందనే ఆశతో ఎదురు చేస్తున్నారు విద్యార్థులు. ఇంఛార్జి వీసీ బడ్జెట్ తయారు చేసి, ప్రభుత్వానికి నివేదించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ నెల 24న బడ్జెట్ సమావేశాల్లో శాతవాహన యూనివర్సిటీకి ప్రత్యేక నిధుల కేటాయింపుపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీనిపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ఓ కేంద్ర మంత్రి ప్రత్యేక చొరవ చూపిస్తే..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ప్రత్యేక నిధులు మంజూరయ్యే అవకాశాలుంటాయి.