పర్యాటక కేంద్రంగా అభివృద్ధికి చర్యలు
నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పనపై దృష్టి
నియోజక వర్గ అభివృద్ధిపై కలెక్టర్లతో రాష్ట్ర మంత్రి పొన్నం సమీక్ష
హుస్నాబాద్-జనత న్యూస్
హుస్నాబాద్ నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో రోల్ మోడల్గా తీర్చి దిద్దుతానని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీవో ఆఫీసులో అభివృద్ధిపై నియోజక వర్గ స్థాయి సమావేశం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించారు. సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు మిక్కిలినేని మను చౌదరి, పమేలా సత్పతి, ప్రావీణ్యతో పాటు అదనపు కలెక్టర్లు, ఆయా జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. సుమారు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. విద్యా, వైద్యం, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తానని, పెండిరగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తిపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. హుస్నాబాద్ను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతానని, ఇక్కడి నుంచి చేపలు, గొర్లు, హైదరాబాద్ కు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటానన్నారు.
వివిధ శాఖల అధికారులతో చర్చ
మిషన్ భగీరథ, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయత్ రాజ్, గిరిజన సంక్షేమం, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ, వ్యవసాయం, విద్యుత్తు, డిఆర్డిఏ తో పాటు పలు శాఖలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. చేనేత, వ్యవసాయ ఆధారిత రంగాలతో పాటు పలు పథకాలను రైతులు పేద వర్గాలకు అందేలా చొరవ చూపాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటానన్నారు. గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కుటీర పరిశ్రమల కల్పనకు కృషి చేస్తానని వెల్లడిర చారు.
ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత
గౌరవెల్లి, దేవాదుల, ఎస్సారెస్పీ, మిడ్ మానేర్ ప్రాజెక్టుల ద్వారా హుస్నాబాద్ రైతాంగానికి సాగునీరు అందేలా ప్రత్యేక కృషి చేస్తానని చెప్పారు. నియోజకవర్గంలో విద్యా, వైద్యం, వ్యవసాయము, పాడిపంట, వ్యవసాయ ఆధారిత రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. ఇక్కడ పాల ఉత్పత్తి అధికంగా జరుగుతున్నదని, పశుసంపద పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యువత చేపలు, గొర్లు, మేకల పెంపకం తో పాటు డైరీ ఫామ్స్ ఏర్పాటుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. హుస్నాబాద్ నుంచి చేపలు మేకలు, గొరు,్ల హైదరాబాద్ కు ఎగుమతి చేసేలా ప్రత్యేక దృష్టి సారిస్తాన్నారు. హుస్నాబాద్ను టూరిస్టు స్పాట్గా తీర్చి దిద్దుతాన్నారు. రోడ్ల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. స్వశక్తి సంఘాల బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటానని, నియోజక వర్గంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
విద్య, వైద్య సేవలందిస్తాం
ప్రజలకు వైద్య పరంగా సహాయం అందించేందుకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఇందుకు తగిన సిబ్బందిని ఏర్పాటు చేశానని చెప్పారు. అధికంగా కిడ్నీలు ఫెయిల్ అయి డయాలసిస్ కి వెళ్తున్నారని, దీనిపై ప్రభుత్వం ఒక సర్వే నిర్వహిస్తున్నదని, దానికి పరిష్కారం మార్గం కనుక్కుంటామని తెలిపారు. విదేశీ విద్యా విధానంలో భాగంగా విదేశాలకు వెళ్లే యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, ప్రఫుల్ దేశాయ్, రాధిక గుప్తా, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మి కిరణ్ వెంకట్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.