– సోషల్ మీడియాలో పిల్లల, ఫ్యామిలీ ఫోటోలు వద్దని హెచ్చరిస్తున్న పోలీసులు
– తాజా పరిణామాలతో సోషల్ మీడియాలో అతి జాగ్రత్త అవసరం
– ఇటీవల యూట్యూబ్లో ఓ కుటుంబం పై అసభ్య కామెంట్స్
– ఫోటోలకు ప్రైవసీ మస్ట్
– ఫోటోలను దుర్వినియోగం చేసే ఛాన్స్
– సోషల్ మీడియా యూజర్లను హెచ్చరిస్తున్న తెలంగాణ పోలీసులు
– హనుమకొండ, జనతా ప్రతినిధి :
ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఎంతో జాగ్రత్త అవసరం.. ఫోటోలు దిగడం స్టేటస్ లు పెట్టడం చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది. గ్రూప్ ఫోటోలు, పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం కామన్ అయిపోయింది.. ఇప్పుడు ఇదే వద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇది ఎన్నో అనర్ధాలకు దారి తీస్తున్న క్రమంలో జాగ్రత్తగా ఉండడం మేలని పోలీసులు సలహా ఇస్తున్నారు. తండ్రి కూతుర్ల అనుబంధం పై ఓ యూట్యూబర్ ఇటీవల చేసిన అసభ్య కామెంట్లకు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో, తెలుగు హీరోలు ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో తెలంగాణ పోలీసులు సోషల్ మీడియా యూజర్లకు సలహాలతో కూడిన హెచ్చరికను జారీ చేసింది. మీ పిల్లల,కుటుంబ సభ్యుల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని చెబుతూ ఫోటోలకు ప్రైవసీ ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మీకు దగ్గర వ్యక్తులే ఫోటోలను దుర్వినియోగం చేసే ఛాన్స్ ఉన్నందున ప్రైవసీ అవసరమని పోలీసులు చెబుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దానికి తోడు సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో రోస్టింగ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. ఎవరైనా పాపులారిటీ సాధిస్తున్నారంటే వారి శారీరక లోపాలను ఎత్తిచూపుతో బూతులతో టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అసభ్య కామెంట్స్, మీమ్స్ అత్యధికంగా స్క్రోల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని పరిస్థితి నెలకొనగా మంచి కన్నా ఎక్కువ చెడే స్క్రోల్ అవుతుండడంతో సోషల్ మీడియా పోస్టులు అంటేనే చాలామంది ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకైనా సోషల్ మీడియాను అవసరానికి అనుగుణంగా వాడుకొని అవసరం లేనప్పుడు దూరంగా ఉంటేనే చాలా మంచిది మరి.