కరీంనగర్-జనత న్యూస్
మనిషికి చెట్లు ప్రాణాధారమని, అవిలేకుంటే సమస్త జీవరాశి మనుగడ ప్రమాదంగా మారుతుందని తెలిపారు డీఎఫ్వో బాలమణి. ప్రముఖ ఆయుర్వేద పతంజలి అధినేత ఆచార్య బాలకృష్ణ జన్మదిన సందర్భంగా భారత్ స్వాభిమాన్ ట్రస్ట్, పతని యోగ సమితి, యువభారత్ ఆధ్వర్యంలో కరీంనగర్ గీతా భవన్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మొక్కల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెట్లు, వృక్షాల వల్ల ఆక్సిజన్, పండ్లు, ఆయుర్వేద ఔషధాలు , ఆహార పదార్థాలు అందిస్తాయని తెలిపారు. ప్రస్తుత వర్షాకాలంలో ప్రతి వ్యక్తి విరివిగా మొక్కలు నాటాలని ఆమె పిలుపునిచ్చారు. యువభారత్ రాష్ట్ర అధ్యక్షులు ముత్యాల రమేష్ మాట్లాడుతూ.. చెట్లను పెంచడం ఒక సామాజిక బాధ్యతగా గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. యోగం, ఆయుర్వేదం మన సంస్కృతిలో ఒక భాగం అని.. ప్రతి మొక్క ఒక ఔషధ గుణం కలిగి ఉంటుందని, వాటి ప్రాధాన్యత తెలిసినప్పుడు హాస్పిటల్ ఖర్చులు తగ్గించు కోవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో యువభారత్ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం మధు, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ బాధ్యులు మనోజ్ ముందాడ, ఆలేటి శ్రీనివాస్, శ్రవణ్ కుమార్, కేఇఎస్ శేఖర్, విజయ, నాగమణి, పతంజలి యోగ సమితి అధ్యక్షులు బి. లక్ష్మీనారాయణ, పతంజలి బాధ్యులు నాగమల్ల శ్రీనివాస్, పరుశురాం, రామచంద్రారెడ్డి, ఎం. శ్రీనివాస్, ఎఫ్.బి.ఓ అజామొద్ధీన్లతో పాటు యోగ సాధకులు పాల్గొన్నారు.