ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, రాహుల్ సమక్షంలో చేరిక
రాజ్యసభకు రాజీనామా చేసే యోచనలో కేకే
డిల్లీ :
రాజకీయ భీష్ముడు, సీనియర్ నేత కే కేశవ రావు కాంగ్రెస్ గూటికి చేరారు. న్యూ డిల్లీలో బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం ఏ రేవంత్ రెడ్డి, తెలంగాణ ఇంఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో సుమారు ఐదు దశాబ్దాల పాటు వివిధ హోదాలో పని చేసిన కేకే..2013లో ఆ పార్టీని వీడీ టీఆర్ఎస్లో చేరారు. వెంటనే ఆ పార్టీ అధినేత కేసీఆర్ పోలిట్ బ్యూరో సభ్యునిగా అవకాశం కల్పించారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యులుగా పని చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. ఇప్పటికే ఆయన కూతురైన గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మి కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. కేకే రాజ్యసభ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
కేకేకు ప్రాధాన్యతిచ్చే అవకాశం..
కేశవరావు 2005 నుంచి 2008 వరకు ఏపీసీసీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన కేకే సేవలను, ప్రస్తుత సమయంలో వినియోగించుకోవాలని ఆ పార్టీ అదిష్టానం చూస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అంశాలపై అవగాహన ఉన్న కేకే సేవలను కాంగ్రెస్ ఏ రకంగా ఉపయోగించుకుంటుందో వేచి చూడాలి.