Thursday, September 19, 2024

Onion Price : కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి.. ఎన్నికల పై ప్రభావం చూపేనా..?

కరీంనగర్ ప్రతినిధి (జనతా న్యూస్): మొన్నటివరకూ టమాట ధరతో బెంబేలెత్తిన సామాన్యుడు నేడు ఉల్లి ధరను చూసి నీరుగారిపోతున్నాడు.దీపావళి పండుగకు టపాసుల ధరల కన్నా ఎక్కువగా వున్న ఉల్లి ధరతో సామాన్యుడి గుండె లక్ష్మీ బాంబులా పేలిపోనున్నది.ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ ఉల్లిధరల ప్రభావం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా పడే అవకాశం ఉంది.సోమవారం హైదరాబాద్ లో కిలో ఉల్లి ధర 90 రూపాయలు పలికింది. ఉల్లి ధరలకు బెంచ్ మార్కుగా భావించే మహారాష్ట్ర లోని లాసల్ గావ్ ఏపీఎంసీ లో గత 15 రోజుల క్రితం ఉల్లిధరలు ఏకంగా 50 శాతం పెరిగాయి.ఈ వారం మరో 18 శాతం పెరిగినట్లు అధికారుల సమాచారం.

మహారాష్ట్ర లో సగటు ఉల్లిధర కిలో 50 రూపాయలకు చేరినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ లో కూడా ఉల్లిధరలు 25 నుంచి 50 శాతం పెరిగి 70 రూపాయల వరకు చేరింది.గత రెండు వారాల క్రితం హైదరాబాద్ లో కిలో ఉల్లి 30 నించి 40 రూపాయలకే లభించింది.గత ఏడాది ఇదే సీజన్లో కిలో ఉల్లిపాయలు 50 రూపాయలే ఉండింది.ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కూడా ఉల్లి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. ఏపీ లోని కర్నూల్,తెలంగాణ లోని మహబూబ్ నగర్, సంగారెడ్డి,మెదక్,చేవెళ్ల ప్రాంతాలలో ఉల్లిసాగు గణనీయంగా తగ్గిపోయింది.వాతావరణం మార్పుల ఫలితంగా ఖరీఫ్ సీజన్ లో ఉల్లి నాట్లను వేయటం ఆలస్యమైంది. దీంతో సకాలంలో పంట చేతికి రాలేదు. రబీలో పండించిన స్టాక్ ఖాళీ కావటంతో ఉల్లిధరలు పెరిగిపోయాయి.

గత ఏడాది అక్టోబర్ వరకు కర్నూల్ మార్కెట్ కు 1.95 లక్షల క్వింటాళ్ల ఉల్లి దిగుబడులు వచ్చాయి.ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి కేవలం 70,377 క్వింటాళ్ల ఉల్లి పంట వచ్చిందని సమాచారం. కర్నూల్ జిల్లాలో జూన్ నుంచి అక్టోబర్ వరకూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. వానలు లేకపోవటంతో పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఉల్లి పంటపై తీవ్ర ప్రభావం ఏర్పడింది. మరో వైపు మహారాష్ట్ర,కర్ణాటక రాష్ట్రాలలో కురిసిన భారీ వర్షాలు కూడా ఉల్లి పంటపై ప్రభావం చూపింది.వాతావరణం లో మార్పు కారణంగానే ఉల్లి పంట సప్లై తగ్గిపోయిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.అయితే కేంద్ర ప్రభుత్వం 2024 డిసెంబర్ 31వరకు ఉల్లి ఎగుమతులపై టన్నుకు 800 డాలర్ల కనీస ధరను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది.దీంతో ఉల్లి ఎగుమతులు తగ్గి పోతాయని కేంద్రం యోచిస్తోంది. ఉల్లి ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఉల్లిని సరఫరా చేసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది.
ఉల్లిధరలు ఎక్కువగా వున్న రాష్ట్రాలకు ఆగస్ట్ నుంచే ఉల్లిపాయలు తరలించే కార్యక్రమం చేపట్టారు.

ఇప్పటి వరకు 22 రాష్ట్రాలకు 1.7 లక్షల టన్నుల ఉల్లిని సరఫరా చేశామని అధికారులు స్పష్టం చేశారు. నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూ మర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆద్వర్యం లో ఉల్లి అమ్మకాలు చేపడుతున్నట్లు తెలిపారు.2024-24ఆర్థిక సంవత్సరానికి 5 లక్షల టన్నుల ఉల్లిని నిల్వచేశారు.రానున్న రోజుల్లో మరో 2 లక్షల టన్నుల ఉల్లి ని నిల్వచేస్తామని చెప్పారు. ఈ ఉల్లిని వివిధ రాష్ట్రాలకు పంపిస్తామని తెలిపారు.
ఖరీఫ్ పంట మార్కెట్ లోకి వచ్చే వరకు అంటే డిసెంబర్ వరకు ఉల్లి ధరలు పెరిగే అవకాశం ఉంది.ఉల్లి దేశీయ లభ్యతను మెరుగు పరచడానికి బఫర్ స్టాక్ పరిమితిని 3 లక్షల టన్నుల నుంచి 5 లక్షల టన్నుల వరకు కేంద్రం పెంచింది.అయితే తెలంగాణ లో ఈ ఉల్లిధరల ప్రభావం అసెంబ్లీ ఎన్నికల పై పడే ప్రభావం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page