మానేరు రివర్ ఫ్రంట్పై ముందుకా..వెనక్కా..?
ఉద్యోగం మానేసిన టూరిజం శాఖ అధికారి ?
ఎన్జీటీకి ఇవ్వనున్న నివేదికపై ఉత్కంఠ
దీనిపై రాష్ట్ర మంత్రి పొన్నం ఆరా..
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
దక్షణ భారత దేశానికి మణిహారంగా, గుజరాత్ సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో కరీంనగర్లో నిర్మించ తలపెట్టిన మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతిపై ప్రతిష్టంభన నెలకొంది. నీటి పారుదల శాఖ అనుమతులు లేకుండా తెలంగాణ టూరిజం డెవలాప్మెంట్ కార్పోరేషన్ చేపట్టిన ఈ పనులపై ఎన్జీటీలో కేసు కొనసాగుతోంది. వచ్చే డిసెంబర్ 2న ఎన్జీటీ హీయరింగ్లో నీటి పారుదల శాఖ, టూరిజం డెవలాప్మెంట్ కార్పోరేషన్ అధికారులిచ్చే నివేదికలపై కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ భవిష్యత్ ఆధార పడి ఉంది. దీనిపై ఈ నెల 27న హైదరాబాద్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పవర్ అధికారులతో కలసి పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వీక్షించి, ఎన్జీటీ కేసుపై ఆరా తీశారు. కాగా..ఈ ప్రాజెక్టును చేపట్టిన టూరిజం డెవలాప్మెంట్ కార్పోరేషన్లో ప్రకంపనలు రేకెత్తాయి. గతంలో ఎండిగా పని చేసిన బోయినపల్లి మనోహర్ రావును ప్రభుత్వం తొగలించగా, కరీంనగర్ టూరిజం శాఖ అధికారి ఉద్యోగం వదిలిపెట్టి వెల్లినట్లు సమాచారం.
కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ పనులు ఒక అడుగు ముందుకు ఏడడుగులు వెనక్కి అన్నట్లుగా ఉన్నాయి. 2021 మార్చిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 2023 ఆగస్టు వరకు పూర్తి కావల్సి ఉండగా..ఇప్పటి వరకు 25 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. వివిధ శాఖల సమన్వయ లోపం, ముందస్తు అనుమతులేవీ తీసుకోక పోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. ఈ ప్రాజెక్టు ప్రారంభించే ముందే పర్యావరణ అనుమతులు అవసరమా..లేదా..ఇతర ముఖ్యమైన అంశాలను పక్కన పెట్టడం వల్ల అనేక చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిపై ఓ రైతు ఎన్జీటీని ఆశ్రయించగా ఈ నెల 18న పలు అంశాలు పరిశీలించి కీలక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 2, 2024న తదుపరి విచారణ పూర్తి అయ్యే వరకు పనులేవి చేపట్ట రాదని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా..దీనిపై ఈ నెల 27న హైదరాబాద్లో మున్సిపల్ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, కరీంనగర్ మున్సిపల్ కమీషనర్, అదనపు జిల్లా కలెక్టర్ లతో మానేరు రివర్ ఫ్రంట్ పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్జీటీలో కొనసాగుతున్న కేసుపై అధికారులకు ఆయన సూచనలు చేశారు.
ఎన్జీటీ లెవనెత్తిన అంశాలు ఇవే..
కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ పనులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ పలు కీలక అభ్యంతరాలు లేవనెత్తింది. నీటి పారుదల శాఖ అనుమతులు లేకుండా రివర్ ఫ్రంట్ పనులు ఎలా చేపట్టారని టీఎస్టీడీసీ అధికారులను ప్రశ్నించింది. ఈ నెల 18న విచారణలో కీలక అంశాలను ప్రస్తావించింది ఎన్జీటీ . టీఎస్ టీడీసీ చేపట్టిన పనులపై అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతిని అధికారులు ఎన్జీటీకి వివరించారు. టూరిజం డెవలాప్మెంట్ కార్పోరేషన్ మ్యుజికల్ ఫౌంటెన్, ప్రవేశ ప్లాజా, బైపాస్ రోడ్ నుండి బండ్ వరకు పార్మేషన్ రోడ్, ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపట్టినట్లు, ఇందుకు 2.59 ఎకరాల్లో లేవలింగ్ పనులను పూర్తిచేసినట్లు వివరించారు. ఇందుకు రూ. 4 కోట్లు ఖర్చు అయినట్లు ఎన్జీటీకి నివేదించారు అధికారులు. అనుమతులు లేక పోవడంతోనే ఎల్ఎండీ ప్రాజెక్టు దిగువ భాగాన చేపట్టిన రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులను నిలిపి వేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
టూరిజం శాఖ అధికారుల్లో గుబులు..
కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ..రాష్ట్ర టూరిజం శాఖ అధికారుల్లో గుబులు రేపుతోంది. ఇప్పటికే ఆ శాఖ జిల్లా అధికారి ఒకరు ఉద్యోగాన్ని వదిలి వెల్లినట్లు సమాచారం. గతంలో టూరిజం శాఖ ఎండీగా పనిచేసిన బోయినపల్లి మనోహర్ రావును ప్రస్తుత ప్రభుత్వం తొలగించగా, ఇటీవల కాలంలోనే కరీంనగర్ జిల్లా అధికారి కూడా తప్పుకోవడం సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే..డిసెంబర్ 2న ఎన్జీటీకి ఆయా శాఖల అధికారులిచ్చే నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ సర్కారు రూ. 410 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు రూ. 100 కోట్ల వరకు పనులు జరిగినట్లు తెలుస్తుంది. ఈ పనులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తానని చెప్పడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఈ ప్రాజెక్టును ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా..? లేక..వదిలేస్తుందా..అనేది తేలాల్సి ఉంది.