కరీంనగర్, జనతా న్యూస్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ రూరల్ డివిజన్ లోని చొప్పదండి పోలీస్ స్టేషన్ ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఆకస్మిక తనిఖీ చేశారు.పోలీస్ స్టేషన్ లోని పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకున్నారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు. రానున్న లోక్ సభ ఎన్నికల సందర్బంగా పోలీస్ స్టేషన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ అధికారులంతా నిజాయితీగా , నిస్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ప్రతి ఒక్కరు విధిగా సందర్శించి ఏమైనా లోటు ఉన్నట్లయితే వెంటనే పై అధికారులకు తెలపాలన్నారు. రౌడీషీటర్లు , హిస్టరీ షీటర్లతో పాటుగా గతంలో ఎన్నికల సమయంలో జరిగిన గొడవల ఆధారంగా బాధ్యులను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే బైండోవర్ కాబడి గడువు ముగిసిన వారిని తిరిగి బైండ్ ఓవర్ చేయాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత పోస్టులు పెట్టేవారిని సైతం గుర్తించి వారిని కూడా బైండ్ ఓవర్ చేయాలన్నారు. స్టేషన్ పరిధిలోగల సమస్యాత్మక , సున్నితమైన ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలన్నారు. పెండింగ్ వారెంట్ల అమలు చేయాలన్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవన్నారు. అధికారులంతా సమిష్టిగా పనిచేసి ఎన్నికలు ప్రశాంతగా ముగిసేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ గౌడ్ , చొప్పదండి ఎస్సై ఉపేందర్ చారి ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
చొప్పదండి పోలీస్ స్టేషన్ లో కరీంనగర్ సీపీ తనిఖీ
- Advertisment -