కరీంనగర్, జనతా న్యూస్: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలోని 17 స్థానాల్లోని 14 వాటిల్లో పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మిగతా కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ అభ్యర్థులను పెండింగులో ఉంచింది. వీటిలో కరీంనగర్ లోక్ సభ స్థానంపై హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ఈ స్థానం నుంచి ఇప్పటికే పలువురు పేర్లు అధిష్టానం వద్ద ఉన్నా.. ఎక్కువగా వెలిచాల రాజేందర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని మూడు స్థానాల అభ్యర్థుల విషయమై ఆదివారం కేసీ వేణుగోపాల్ పీసీసీ నేతలతో సమావేశం అయ్యారు. అయితే నిన్నే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని అదరూ భావించారు. కానీ ఎటూ తేల్చలేదు.
అయితే సోమవారం అభ్యర్థులు ఎవరో తేలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కావడంతో కాంగ్రెస్ కేడర్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్, బీజేపీలో ప్రచారంతో ప్రజల్లోకి చొచ్చుకుపోవడంతో తమ అభ్యర్థి ఎవరో తెలియక ఆందోళన చెందుతున్నట్లు అధిష్టానం గుర్తించింది. ఈ నేపథ్యంలో మరింత ఆలస్యం చేస్తే మొదటికే మోసం అవుతుందని భావించింది. ఇందులో భాగంగా సోమవారం అటో ఇటో అన్నట్లు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
కరీంనగర్ నుంచి మొదటి నుంచి వెలిచాల రాజేందర్ రావు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డికే అవకాశం ఇస్తారని అన్నారు. కానీ కరీంనగర్ నేతలు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినట్లు ప్రచారం. ప్రవీణ్ రెడ్డీ పోటీ చేస్తే నాన్ లోకల్ అనే ముద్ర పడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఇతరులకు ఇస్తే అవకాశం ఇచ్చినట్లువుతుందని అన్నారు. దీంతో వెలిచాల రాజేందర్ రావుపై ఎక్కువగా పోకస్ పెట్టినట్లు సమాచారం.
