కేంద్ర అధికార బృందం పర్యటన..
నష్టాన్ని పరిశీలించిన అధికారులు..
ఖమ్మం-జనత న్యూస్
ఇటీవలి భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించింది కేంద్ర బృందం. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అడ్వైజర్ కల్నల్ కెపి సింగ్ నేతృత్వంలో మహేష్ కుమార్, శాంతినాథ్ శివప్ప, కుష్వాహ, నియాల్ కన్సన్, శశివర్ధన్ రెడ్డి లతో కూడిన కేంద్ర బృందంలో ముగ్గురు చొప్పున రెండు బృందాలుగా ఖమ్మం జిల్లాలో పర్యటించింది. మొదటి బృందం కూసుమంచి మండలం భగత్ వీడు, ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు, తనకంపాడు, కస్నా తాండ, తిరుమలాయపాలెం మండలం రాకాశితండా గ్రామాల్లో.. రెండో బృందం కూసుమంచి మండలం మల్లాయిగూడెం, భద్రు తాండ, పాలేరు, ఎర్రగడ్డ తాండ గ్రామాల్లో పర్యటించి భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. గ్రామాల్లో ఇసుక మేటలు, మట్టి తో నిండిన పొలాలు, కొట్టుకుపోయిన వంతెనలు, రోడ్లు, దెబ్బతిన్న ఇండ్లు, సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన కుటుంబాలను అధికారులు కలసి, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. పొలాల్లో జరిగిన నష్టం, తిరిగి సేద్య యోగ్యంగా పొలాన్ని తయారుచేయుటకు అగు ఖర్చును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ (విపత్తు నిర్వహణ) రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, రాష్ట్ర గనులు, భూగర్భ ఖనిజాల శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ వారితో ఉన్నారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కేంద్ర బృందం పర్యటన సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను చూపిస్తూ, భారీ వర్షాలు, వరదలు సృష్టించిన విలయాన్ని బృందానికి వివరించారు. వారి వెంట శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.