వరంగల్, జనతా న్యూస్:తెలంగాణలో రైతులకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే హుజురాబాద్ నియోజకవర్గం లోని 106 గ్రామాలకు మరో తడి కోసం నీళ్లు అందించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు., నీళ్లు ఇవ్వకపోతే స్వయంగా తానే గేట్లు ఎత్తుతానని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం మర్రిపల్లి గూడెం గ్రామంలో బుధవారం మొక్కజొన్న ఎండుతున్న తీరును చూసి రైతుల పక్షాన మాట్లాడారు. ప్రభుత్వం చెప్పిన విధంగానే రైతులు పంటలు వేసుకున్నప్పటికీ సకాలంలో నీళ్లు అందించక పోవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కెసిఆర్ హయాంలో గత పది సంవత్సరాలుగా నీళ్ల కోసం రైతులు ఏనాడు రోడ్లు ఎక్కలేదని, కెసిఆర్ పదవి నుంచి పక్కకు తప్పుకోగానే రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడలేదని త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంతకింత అనుభవిస్తుందని శాపనార్ధాలు పెట్టారు.
రైతుబంధు పూర్తిస్థాయిలో పడలేదని దాంతోపాటు రైతు బీమా, రుణమాఫీ, బోనస్ ఇస్తామని చెప్పి రైతులను నట్టేట ముంచారని, వెంటనే సాగు నీళ్లు ఇవ్వకపోతే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తే ప్రజలు కాంగ్రెస్ నాయకుల్ని ఉరికిస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గం మొత్తంలో ఒక్క ఎకరం ఎండిన చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ తో పాటు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, పిఎస్ సి ఎస్ చైర్మన్ సంపత్ రావు,జడ్పిటిసి కళ్యాణి లక్ష్మణరావు, ఎంపిటిసి ఫోరం మండల అధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, పిఎసిఎస్ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి, సీనియర్ నాయకులు తక్కలపల్లి సత్యనారాయణ రావు, మాజీ జెడ్పిటిసి నవీన్, లీడర్లు ఇనుగాల విజయ్ కుమార్, మాజీ ప్రజాప్రతినిధులు, రైతుల పాల్గొన్నారు.
