కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
మరిమడ్ల, డుమాల, ఈఎంఆర్ఎస్ పాఠశాలల పరిశీలన
కోనరావుపేట/ ఎల్లారెడ్డిపేట-జనత న్యూస్
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో మెరుగైన వసతులు కల్పిస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల..ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పీ అఖిల్ మహాజన్ లతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ముందుగా ఆర్ట్ గ్యాలరీలు ప్రారంభించిన అనంతరం కోనరావుపేట మండలం మరిమడ్ల లోని విద్యాలయంలో రూ. 16 లక్షల అంచనాలతో 8 టాయిలెట్స్కు శంఖుస్థాపన చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయా విద్యాలయాల్లో విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం ఇస్తున్నారా? ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. టాయిలెట్స్, ప్రహరీ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం గిరిజన విద్యార్థులందరికీ కార్పొరేట్ కు ధీటుగా నాణ్యమైన విద్య, వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఒక్కో విద్యార్ధికి సగటున రూ.1 లక్షా 9 వేలు ఖర్చు చేస్తోందాని చెప్పారు. 2018-19 ఆర్దిక సంవత్సరంలో ప్రతి బ్లాక్ పరిధిలో 50 శాతానికంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో ఈ ఎం ఆర్ ఎస్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ తరువాత 2022లో కనీసం 20 శాతం ఎస్టీ జనాభా కలిగిన ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సంకల్పించారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 728 మంజూరు చేస్తే… ప్రస్తుతం 410 స్కూల్స్ లో విద్యాబోధన కొనసాగుతున్నదని వివరించారు. సగటున ఒక్కో స్కూల్ లో 480 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశవ్యాప్తంగా 1 లక్షా 26 వేల 626 మంది విద్యార్థులు చదువుతున్నారని, తెలంగాణలో 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలుంటే… అందులో 8309 మంది విద్యార్థులున్నారని వెల్లడిరచారు. రెసిడెన్షియల్ భవన నిర్మాణం కోసం రూ. 37 కోట్ల 80 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోని ఏకలవ్య స్కూల్స్ భవన నిర్మాణానికి 48 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారని వివరించారు. ఈ పాఠశాలల్లో 10 శాతం సీట్లు మాత్రమే ఇతరులకు రిజర్వేషన్ కల్పిస్తుండగా మిగతా 90 శాతం సీట్లు ఎస్టీ విద్యార్థులకే నని, క్రీడల్లో ప్రతిభ కలిగిన ఎస్టీ విద్యార్థులకే స్పోర్ట్ కోటా కింద 20 శాతం సీట్లను కేటాయిస్తున్నారని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్సీఓ జాను నాయక్, డీఈఓ రమేష్ కుమార్, ప్రత్యేక అధికారులు లక్ష్మీ రాజం, భారతి, రాందాస్, ఆర్డీవోలు రాజేశ్వర్, రమేష్, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, ప్రిన్సిపాల్ ఆర్ ఎస్ యాదవ్, మంజిథ్, తహసిల్దార్లు రాం చంద్రం, విజయ ప్రకాష్ రావు, ఎంపీడీఓ శ్రీనివాసమూర్తి, సత్తయ్య, డీఎల్ పీఓ రాజు పాల్గొన్నారు.
ఏకలవ్య పాఠశాలల్లో..విద్యార్థులతో కేంద్ర మంత్రి..

- Advertisment -