Saturday, March 14, 2026

ఎకరాకు రూ.25వేల పరిహారం ఇవ్వాలి: మాజీ ఎంపీ

ఇల్లంతకుంట జనతా న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పరిపాలన తోనే ఈ కరువు వచ్చిందని మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ అన్నారు.  ఇల్లంతకుంట మండలం లోని రహీంఖాన్ పేట గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తుల ఉమతో కలిసి  ఎండిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల బాధలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని ,యాసంగి పంటలకు సాగునీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మేడిగడ్డ వద్ద గోదావరి నదిలో రోజుకు 5000ల క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోయి సముద్రంలో కలుస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 50 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రైతులకు కాంగ్రెస్ పార్టి మాయమాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపిందని అన్నారు.

మేడిగడ్డ బ్యారేజ్ మూడు పిల్లర్లు కుంగితే దానిని సాకుగా చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను ఎండబెట్టి , సాగునీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీరు పెట్టిస్తోందని పేర్కొన్నారు. మద్య మానేరులో 16 టీఎంసీల నీరు ఉన్నప్పుడు రెండు టీఎంసీల నీటిని అన్నపూర్ణ రిజర్వాయర్ లోకి మళ్ళిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. ప్రభుత్వం రైతులకు ఎకరాకు ₹25వేల పంట నష్ట పరిహారం అందించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోకుంటే ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు క్వింటాలుకు ₹500 బోనస్ ఇవ్వాలని అన్నారు. రైతుభరోసా పథకం ద్వారా రైతులకు ఎకరాకు ₹15000ల సాయం, ₹2లక్షల రుణమాఫీ చేయాలని అన్నారు. రైతులను కన్నీరు పెట్టిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులుండవన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ బిల్లవేని పర్శరాం, మాజీ ఏఎంసీ చైర్మన్ వేణురావు, అనంతగిరి ఎంపీటీసీ పర్శరాం, గుండ ముత్తయ్య,కెవిఎన్ రెడ్డి, గాదె కనకయ్య, బిల్లవేని చంద్రయ్య, కొమ్ము కనకయ్య, ఏనుగుల పర్శరాం, ఏనుగుల బుచ్చిరెడ్డి, కూస నరేష్, బిల్లవేని సాయి, ఆరే కొమురయ్య, జక్కుల నాగరాజు యాదవ్, దూలం సంపత్ గౌడ్, సంతోష్ రెడ్డి, ఆళ్వాల రాజేశం, రమేశ్,ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page