అదీ కోర్టు ఆదేశాల మేరకు..
పందెం కోడి ధర రూ.4000..
వేలంలో దక్కించుకున్న సారయ్య
మంథని-జనత న్యూస్
పందెం కోళ్లకు వేలం వేశారు. అదీ పోలీస్ స్టేషన్లో ! కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు వేలం పాట నిర్వహించగా..ఎక్కువ పాట పాడిన ఇద్దరు వ్యక్తులు.. రెండు కోళ్లను సొంతం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని పోలీస్ స్టేషన్లో ఈ విచిత్రం చోటు చేసుకుంది. గత నెల 27న పెంచికల్పేటలో కోళ్ల చోరీలు జరుగుతున్నాయనే ఫిర్యాదు మేరకు..పోలీసులు గాలింపు చేపట్టగా ఇద్దరు దొంగలతో పాటు రెండు కోళ్లను పట్టుకున్నారు. దొంగలను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. దొరికిన రెండు కోళ్లను వేలం వేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొద్ది రోజుల పాటు పోలీస్ స్టేషన్లో కోళ్లకు దాన పెట్టి పోషించిన పోలీసులు..మంగళవారం వేలం పాట నిర్వహించారు. ఇందులో 25 మంది పాల్గొన్నారు. మార్కెట్ ధరతో కోళ్ల వేలం ప్రారంభించగా పురానం సారయ్య రూ. 4000 వేలు పాడి మొదటి కోడిని దక్కించుకోగా..రెండో కోడిని రూ. 2500 లతో దర్కించుకున్నాడు సత్యనారాయణ. వేలం పాటలో వచ్చిన డబ్మును డీడీ తీసి కోర్టుకు అప్పగిస్తామని ఎస్ఐ చంద్ర శేఖర్ తెలిపారు. ఎక్కడైన ఎవరికైనా కోడి దొరికితే, మసాలాతో పసందైన చికెన్ కర్రీ వండిరచి విందు చేసుకునేందుకు మొగ్గు చూపుతారు. ఇక్కడి పోలీసుల తీరు ఇందుకు విభిన్నంగా..ఆదర్శంగా, స్ఫూర్తి దాయకంగా ఉందనే చర్చ జరుగుతోంది.