Thursday, September 19, 2024

ఆశా జనకంగా ఎల్లంపల్లి..

ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు లో పెరగని ఇన్‌ఫ్లో..
ఎస్‌ఆర్‌ఎస్‌పీకి 18 వేల క్యూసెక్కుల వరద

కరీంనగర్‌-జనత న్యూస్‌

గత కొద్ది రోజులుగా పడుతున్న ముసురుతో ప్రాజెక్టుల్లోకి పెద్దగా నీరు వచ్చి చేరడం లేదు. ప్రధానంగా కరీంనగర్‌ ఎల్‌ఎండీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజ రాజేశ్వర జలాశయం ( మిడ్‌ మానేరు ప్రాజెక్టు) లో ఇన్‌ఫ్లో పెరగడం లేదు. దీంతో నీటి మట్టం పెరగడం లేదు. ఎల్‌ఎండీ పూర్తి స్థాయి నీటి మట్టం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.296 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. 762 క్యూసెక్కులు మాత్రమే మోయ తుమ్మెద వాగు నుండి వరద వచ్చి ఎల్‌ఎండీలో చేరుతోంది. రాజ రాజేశ్వర జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 27 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.82 టీసీఎంల నీరుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అర టిఎంసీ వరకు మాత్రమే నీరు వచ్చి చేరింది. గత సంవత్సరం ఇదే సీజన్‌లో ఇందులో 15 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ప్రస్తుతం వరద కాలువ, మూలవాగు నుండి పెద్దగా ఇన్‌ఫ్లో లేక పోవడంతో నీటి మట్టం పెరగడం లేదు.
శ్రీపాద`ఎల్లంపల్లి ప్రాజెక్టులోని ఇన్‌ఫ్లో పెరుగుతోంది. 20 టీఎంసీల నీటి సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 13.533 టీఎంసీలున్నాయి. 18, 894 క్యూసెక్కుల వరద నీరు ఇందులోకి వచ్చి చేరుతోంది. దీంతో క్రమ క్రమంగా ఈ ప్రాజెక్టులోకి నీటి నిల్వలు పెరుగుతున్నాయి. మరో ఐదు టీఎంసీల నీరు వచ్చి చేరితే..ఇక్కడి నుండి మిడ్‌ మానేరు, ఎల్‌ఎండీ లోకి నీటిని వదిలే అవకాశాలున్నాయి. వర్షాలు సమృద్దిగా కురిస్తే, పరిస్థితులు ఆశా జనకంగా ఉంటాయని పలువురు భావిస్తున్నారు.
80 టీఎంసీల నీటి సామర్థ్యం గల ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్టులో ప్రస్తుతం 18, 892 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ సీజన్‌లో జూన్‌ 1 నుండి ఇప్పటి వరకు 20.691 టీఎంసీల నీరు వచ్చి చేరగా, 2.251 టీఎంసీల నీటిని వివిధ అవసరాల కోసం వదిలి పెట్టారు. ప్రస్తుత ఇన్‌ఫ్లో వల్ల కొంత ఆశాజనకంగా ఉన్నా, భారీగా వరద ప్రవాహం వస్తే తప్ప ప్రాజెక్టు నిండే పరిస్థితులు కనిపించడం లేదు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page