
కరీంనగర్, జూన్ 7: అధిక జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకొని స్థానిక వైశ్య భవన్లో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జననం ప్రవచన కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం కేబీ శర్మ శిష్య బృందం నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
బ్రహ్మశ్రీ వేదమూర్తి పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా శ్రీకృష్ణ జననం ప్రవచనాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రవచన కార్యక్రమానికి ముందు నిర్వహించిన సంగీత విభావరిలో కేబీ శర్మ శిష్య బృందం ఆలపించిన అన్నమయ్య, భద్రాచల రామదాసు భక్తి సంకీర్తనలు శ్రోతలను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి.
గాయకులు కేపీ చారి, కనపర్తి శ్రీనివాస్, నేదునూరి నారాయణరావు, నేదునూరి శ్రీలత, భార్గవి, రమ, రమేష్, శ్వేత, నిధి, చంద్రిక, అద్వైత, దుర్గ తదితరులు తమ గానామృతంతో సభికులను అలరించారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సిరిపురం సురేందర్తో పాటు భక్తులు, సంగీతాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి సంగీతం మరియు ఆధ్యాత్మిక ప్రవచనాల సమ్మేళనం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

