మిడ్ మానేరులో నిల్వలు పెరిగే ఛాన్స్
గాయిత్రి పంప్ హౌజ్ వద్ద కాంగ్రెస్ నాయకుల పూజలు
కరీంనగర్ – జనత న్యూస్
కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి నదీ ప్రవాహం పెరుగుతుంది. ఎగువ నుండి వస్తున్న వరద వల్ల ప్రాజెక్టుల్లో నీటి మట్టం పెరుతోంది. ప్రధానంగా ఎస్ఆర్ఎస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి మట్టం క్రమ క్రమంగా పెరుగుతోంది. ఈ ప్రాజెక్టు పూర్థి నీటి సామర్థ్యం 20.175 టీఎంపీలు కాగా..శనివారం మధ్యాహ్నం వరకు 17.396 టీఎంసీలకు చేరుకుంది.క్యాచ్ మెంట్ ఏరియా నుండి 12, 931 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. దీంతో నంది మేడారం పంపుల నుండి మిడ్ మానేరులోకి నీటిని వదిలారు అధికారులు. నంది మేడారం పంపుల నుండి 9, 450 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుండి లక్ష్మింపూర్ గాయిత్రి పంప్ హౌజ్ ద్వారా మిడ్ మానేరు లోకి నీటిని పంపింగ్ చేస్తున్నారు.
శ్రీ రాజ రాజేశ్వర ప్రాజెక్టు ( మిడ్ మానేరు) పూర్తి నీటి సామర్థ్యం 27.54 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.86 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీటి విడుదల ద్వారా ఇందులోని నీటి మట్టం పెరిగే అవకాశాలున్నాయి. ఆ తరువాత ఎల్ఎండీలోకి నీటిని విడుదల చేసే అవకాశాలుంటాయి. అయితే..ఎల్ఎండీ ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.330 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. మొయ తుమ్మెద వాగు నుండి పెద్దగా ఇన్ఫ్లో లేక పోవడంతో ప్రాజెక్టు నీటి మట్టం పెరగడం లేదు.
ఎస్ఆర్ఎస్పీ నీటిమట్టం కూడా పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో 30, 554 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు పూర్థి నీటి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 31.255 టీఎంసీల నీరుంది. కొద్ది రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఎస్ఆర్ఎస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో నీటి మట్టం పెరగడం వల్ల ఉత్తర తెలంగాణ ప్రజల్లో ఆశలు చిగురించాయి.
కాంగ్రెస్ నాయకుల పూజలు
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. రామడుగు మండలం గాయిత్రి పంప్ హౌజ్ వద్ద కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న రెడ్డి, నాయకులు పులి ఆంజనేయులు గౌడ్ తదితరులు పూజలు చేశారు. ఇందులో నేరెళ్ల కవితా రాజు, కొక్కెరగుంట సింగిల్ విండో చైర్మన్ ఒంటెల మురళీకృష్ణారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.