ఉనికిని చాటుకునేందుకే ప్రాజెక్టుల బాట..
అసలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్..
బీఆర్ఎస్ కొత్తగా ఉద్ధరించిందేమీ లేదు..
కరీంనగర్ -జనత న్యూస్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో జన రంజకమైన బడ్జెట్ ప్రవేశపెట్టడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మైండ్ బ్లాంక్ అయిందని కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు విమర్శించారు. శుక్రవారం మీడియాకు ఆయన ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జన రంజకమైన బడ్జెట్ ప్రవేశపెట్టడంతో బీఆర్ఎస్ నాయకులకు నూకలు చెల్లాయని పేర్కొన్నారు. ప్రజల్లో ఉనికిని చాటు కునేందుకే మాజీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాజెక్టుల బాట పేరుతో కొత్తనాటకానికి తెర లేపారని మండిపడ్డారు.
వారు ఏ బాట పట్టినా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఎన్ని నాటకాలు వేసినా అన్ని విషయాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
తూతూ మంత్రంగా ప్రాజెక్టుల బాట పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించడం ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. లేకపోతే ప్రజల్లో మరింత చులకన అవుతారని పేర్కొన్నారు.
ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్
బీఆర్ఎస్ నాయకులు తాము ఏదో ఉద్ధరించినట్లు ప్రగల్భాలు పలకడం సరైంది కాదని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం తామే కనిపెట్టినట్టు బిల్డప్ ఇవ్వడం మానుకోవాలని సూచించారు. మొదట ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ ను చూసే కెసిఆర్ పాఠాలు నేర్చుకున్నారని గుర్తు చేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఎల్ఎండి రిజర్వాయర్ ను నిర్మించిందని, అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా జీవి సుధాకర్ రావు పని చేశారని, వారి హయాంలో నిర్మాణం జరిగిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్ ఎం డి రిజర్వాయర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సందర్శించి తన్మయత్వం పొందడం ఆనందం కలిగిందని పేర్కొన్నారు. వారికి ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగిందని, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్ఎండి రిజర్వాయర్ సందర్శించి చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు. వారికి ఇప్పటికైనా కనువిప్పు కలిగిందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనతో ప్రాయచిత్తం..
అట్టర్ ప్లాప్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి లోపాలను పరిశీలించడం వారు చేసిన పాపాలకు పాయాచిత్తం చెందడమేనని మండిపడ్డారు.
లక్షలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి, ఇప్పుడు కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శన పేరిట బీఆర్ఎస్ నాయకులు కొత్త డ్రామాలకు తెరలేపారని, ప్రజలంతా గమనిస్తున్నార ని తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తాము ఎక్కడ లోపాం చేశమో పరిశీలించేందుకే ప్రాజెక్టును సందర్శించారని ఎద్దేవ చేశారు.
బడ్జెట్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత
ప్రజల చేతిలో చావు దెబ్బ తిన్నా, ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు కాంగ్రెస్ నేత రాజేందర్ రావు. తెలంగాణ బడ్జెట్లో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడంతో, బీఆర్ఎస్ నాయకులు దిక్కు తోచని స్థితిలో పడ్డారని విమర్శించారు. గత 10 ఏళ్ల కాలంలో చేసిన అవినీతిని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేరని పేర్కొన్నారు. మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి మీరు ప్రాజెక్టుల బాట పడితే బాగుండేదని సలహా ఇచ్చారు. చేసిన పాపాల పరిహారానికి ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వెలిచాల రాజేందర్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఇది బీఆర్ఎస్ నాయకులకు నచ్చడం లేదని ఆయన మండిపడ్డారు. వారు ఎన్ని పన్నాగాలు పన్నినా , సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతారని ధీమా వ్యక్తం చేశారు వెలిచాల రాజేందర్ రావు.