Wednesday, September 10, 2025

కరీంనగర్ లో 72.54 శాతం పోలింగ్ నమోదు

-గతంలో కంటే 3.24 పోలింగ్ శాతం వృద్ది

కరీంనగర్,జనత న్యూస్:  అధికారులు, సిబ్బంది,రాజకీయ నాయకులు,ప్రజలు అందరి సహకారంతో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి తెలిపారు. మంగళవారం కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల సాధారణ పరిశీలన అధికారి అమిత్ కటారియా పర్యవేక్షణలో రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో పోలింగ్ ప్రక్రియపై సమీక్ష, స్కూటినీ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ,ఈవీఎంల అంశంలో ఏమైనా ఫిర్యాదులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు.ఎలాంటి అనుమానాలు ఉన్న తాము నివృత్తి చేస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో పూర్తవ్వడం సంతోషాన్ని. పార్లమెంట్ ఎన్నికల్లో 72. 54 శాతం పోలింగ్ నమోదయిందని తెలిపారు. గత పార్లమెంట్ ఎన్నికల కంటే ఈసారి 3.24 శాతం వృద్ధి నమోదయిందన్నారు. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడం వల్లే ఈసారి కొంత పోలింగ్ శాతం పెరిగిందని పేర్కొన్నారు.

కరీంనగర్ నియోజ కవర్గంలో మొత్తం ఓటర్లు 3,67,353 మంది ఓటర్లు ఉండగా 2,22,296 మంది ఓటు హక్కు వినియోగించు కున్నారని, పోలింగ్ శాతం 60.51 నమోదయిందని పేర్కొన్నారు. చొప్పదండి నియోజకవర్గం లో 2,33,546 మంది ఓటర్లు ఉండగా, 1,76,001 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని, పోలింగ్ శాతం 75.36 నమోదయిందని చెప్పారు. వేములవాడ నియోజకవర్గంలో 2,26,188 మంది ఓటర్లు ఉండగా, 1,68,373 మంది ఓటు హక్కు వినియోగించుకున్నా రని, 74.44 పోలింగ్ శాతం నమోదయిందని తెలిపారు.సిరిసిల్ల నియోజకవర్గంలో 2,46,547 మంది ఓటర్లు ఉండగా, 1,85,573 మంది ఓటు హక్కును వినియోగించుకు న్నారని 75.27 పోలింగ్ శాతం నమోదు అయిందని చెప్పారు.

మానకొండూర్ నియోజకవర్గంలో 2,25,386 మంది ఓటర్లు ఉండగా 1,75,228 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని 77.75 శాతం పోలింగ్ నమోదయిందని వివరించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో 2,50,429 మంది ఓటర్లు ఉండగా 1,84,858 మంది ఓటు హక్కు వినియోగించుకున్నా రని 73.82 శాతం పోలింగ్ నమోదయిందని పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 2,47,701 మంది ఓటర్లు ఉండగా 1,91,361 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని, 77.25 పోలింగ్ శాతం నమోదు అయిందని వివరించారు. పార్లమెంటు పరిధిలో చూసుకుంటే మొత్తం పోలింగ్ శాతం 72.54 నమోదయిందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే మానకొండూర్ నియోజకవర్గంలో అత్యధికంగా 77.75 పోలింగ్ శాతం నమోదయిందని వివరించారు. కరీంనగర్ నియోజకవర్గంలో గతంలో కంటే ఈసారి కొంతవరకు పోలింగ్ శాతం పెరిగిందని వివరించారు. పోలింగ్ ప్రక్రియ అంతా పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. ఎక్కడా ఎలాంటి తప్పిదాలు జరగకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగడం వల్లే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు. ఇది అందరి సహకారం వల్లే సాధ్యమైందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇందుకు సహకరించిన అధికారులు, సిబ్బంది ప్రజలు రాజకీయ పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని పేర్కొన్నారు. ఎలాంటి తప్పిదాలు లేకుండా అధికారులు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్,లక్ష్మి కిరణ్,సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ పూజారి గౌతమి,ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్,ఆర్డీవోలు కే మహేశ్వర్,రమేష్ బాబు,రాజకీయ పార్టీల నాయకులు బాస సత్యనారాయణ రావు,బండ రమణారెడ్డి,మడుపు మోహన్,సత్తినేని శ్రీనివాస్,రాజేందర్ రావు, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page