- కలెక్టర్ పమేలా సత్పతి అదేశాలు
- 100 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పూర్తి కావాలి..
- ఓటు వేయని ఉద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కరీంనగర్,జనత న్యూస్: ఒక్కరోజే గడువుందని..ఏ ఒక్కరూ మిస్ కావద్దని ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.గురువారం కరీంనగర్ యందు సెయింట్ ఆల్ఫోన్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఎంతమంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని అరా తీశారు.ఎంత మంది ఓటు వేయలేదని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రెండు రోజులు గడువు పెంచిందని తెలిపారు. ఈ నెల 10 వరకు అవకాశం కల్పించిందని చెప్పారు. ఓటు వేయకుండా మిగిలిపోయిన ఉద్యోగులు అందరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకో వాల్సిన బాధ్యత ఉందని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న కరీంనగర్ జిల్లాకు చెందిన 5434 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకునే వారు మొత్తం 6843 మంది ఉద్యోగులు ఉండగా, 5434 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొన్నారు. ఇంకా 1409 మంది ఓటు హక్కును వినియోగించుకో లేదని, వారందరినీ మోటివేట్ చేసి సెంటర్ కు రప్పించి ఓటు వేసేలా అధికారులు ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. 100% ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ సిబ్బంది ఓటింగ్ సందర్భంగా అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అధికారులు ప్రత్యేక దృష్టి శుక్రవారం సాయంత్రం వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో శ్రీనివాస్, పరిశ్రమల శాఖ జీఎం నవీన్ కుమార్, కరీంనగర్ రూరల్ తహసీల్దార్ నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
