- కార్మిక వర్గం బీజేపీకి గుణపాఠం చెప్పాలి
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
- హనుమకొండ సిపిఐ కార్యాలయంలో ఘనంగా మేడే
May Day: వరంగల్, జనత న్యూస్: మేడే స్పూర్తితో శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా బుధవారం హనుమకొండ బాల సముద్రంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట అరుణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి, ఆదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టారని అన్నారు. దేశ సంపదను తన కార్పొరేట్ మిత్రులకు మోడీ కట్టబెడుతున్నారని, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను రోడ్డున పడవేస్తున్నారని అన్నారు. కార్మికులు ఉద్యమించకుండా కార్మిక చట్టాలను సవరించి వారి హక్కులను కాలరాశారని అన్నారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని కాపాడుకునేందుకు, కార్పొరేట్ శక్తుల శ్రమ దోపిడీని అరికట్టేందుకు కార్మిక వర్గం మేడే స్పూర్తితో ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, మాజీ జిల్లా కార్యదర్శి సిరబోయిన కరుణాకర్, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్,ఏఐటీయూసి జిల్లా అద్యక్షుడు వేల్పుల సారంగపాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కు రాజు గౌడ్, సీపీఐ జిల్లా నాయకులు మునిగాల బిక్షపతి, మాలోతు శంకర్, బాషబోయిన సంతోష్, కొట్టేపాక రవి, ఏశబోయిన శ్రీనివాస్, రాసమల్ల దీనా,రాజమణి, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
