- పార్టీ సూచన మేరకే కలిసికట్టుగా పనిచేస్తున్నాం
- కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ మేనిఫెస్టో బిజెపికి మింగుడుపడటంలేదు..
- కులగణన జరిగితే ప్రాభల్యం తగ్గుతుందని మోడీ భయం..
కరీంనగర్,జనత న్యూస్: కరీంనగర పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందరేనని, సంకోచమేమి లేదని రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా డీసీసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడారు. తాము అధిష్టానం సూచన మేరకే పనిచేస్తామని, రాజేందర్ రావు కి సీటు వచ్చే విషయంలో ఎటువంటి సంకోచం లేదని అన్నారు. వెలిచాల నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. కొందరు సీటు విషయంలో తమ పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నారని, పార్టీ సూచన మేరకే తాము ముందుకు వెళ్తున్నట్టు పేర్కొన్నారు. కొందరు పార్టీలో వర్గ విభేదాలు ఉన్నట్టు ఆరోపణలు చేస్తున్నారని, కానీ తమలో ఎలాంటి పొరపొచ్చలు లేవని అన్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన పాంచ్ న్యాయ్ మేనిఫెస్టో బీజేపీకి మింగుడు పడటం లేదని, ముఖ్యంగా కులగణన జరిగితే తమ ప్రాబల్యం పడిపోతుందనే భయం బీజేపీలో ఏర్పడిందని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బంగారం, ఇల్లు అన్ని పోతాయని బీజేపీ శ్రేణులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని సుప్రీం న్యాయ విచారణ జరిపించాలని కోరారు. గడిచిన పదేళ్లలో దేశంలో ఉన్న 80 శాతం మంది హిందువులకు బీజేపీ తీసుకొచ్చిన ఆర్థిక సామాజిక లాభాలు ఏంటో తేల్చాలని నిలదీశారు. 2010లో జరిగిన జన గణనను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తే సుప్రీం కోర్టులో స్టే తెచ్చుకున్నది వాస్తవం కాదా అని నిలదీశారు. తరతరాలుగా త్యాగాలకు నిదర్శనమైన రాహుల్ గాంధీ కుటుంబాన్ని కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చినప్పుడు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ప్రకటిస్తామన్న మోడీ దేశంలో 80 శాతం ఉన్న హిందువులను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని, అత్యధికంగా ఉన్న హిందూ రైతులపై ఎందుకు మూడు నల్ల చట్టాలు తెచ్చావని ప్రశ్నించారు. ఏకచత్రాధిపత్యం వహిస్తూ నియంతృత్వ పాలన కొనసాగిస్తే ప్రజల ఆగ్రహం తప్పదని సూచించారు
ఇక తల్లి బిడ్డ బంధాన్ని గురించి చులకనగా మాట్లాడిన బండి సంజయ్ ఎంపీ అభ్యర్థి మనకు అవసరమాని ప్రజలు అలోచన చేయాలన్నారు.మాట్లాడితే డాంబాకాలు పలకటం కరీంనగర్ జిల్లాకు రూ.1200 పనులు అయినా తెచ్చావా అని బండి సంజయ్ ను ప్రశ్నించారు. దేవుడు ఫోటోతో రాజకీయం మానుకుని నిబద్ధతతో వ్యవహరించాలని సూచించారు. ఉన్నత విద్యావంతుడు, అందరికీ సుపరిచితుడైన వెలిచాల రాజేందర్ ను ఎంపీగా గెలిపించుకుంటే కరీంనగర్ ను అభివృద్ధి పరిచేందుకు మేమందరము సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 25 నుండి ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాసరావు నేతృత్వంలో టీం లను ఏర్పాటు చేసి ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు 46 మండలాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని బూతుల్లోనూ నూరుశాతం మెజార్టీ తెచ్చుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులను కోరారు.
