హైదరాబాద్, జనా న్యూస్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ ను అరెస్టు చేసేందుకు పోలీసుల్ని పంపామని .. అందుకే అమిత్ షా, మోదీ కక్ష కట్టి.. కవితను అరెస్టు చేయించారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత విషయంలో కేసీఆర్ మొదటి సారి స్పందించారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ప్రతినిధులతో కేసీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వంలోని 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సార్ అని ఓ సీనియర్ కీలక నేత తనను సంప్రదించాడని, కానీ ఇప్పుడే వద్దని వారించానని కేసీఆర్ తెలిపారు. తనతో ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అసవరం తనకు లేదన్నారు. అయితే మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టుకుండా ఉంటారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే.. బీజేపీ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారన్నారు. తాము దొరకబట్టుకున్నామని అందుకే మోదీ కక్ష కట్టారని కేసీఆర్ తెలిపారు.
భవిష్యత్ మనదేనని పార్టీ నేతలకు కేసీఆర్ భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయం గందరగోళం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఏ రాజకీయ గందరగోళం జరిగినా బీఆర్ఎస్కే మేలు జరుగుతుంది. ఉద్యమకాలం నాటి కేసీఆర్ను మళ్లీ చూస్తారు. బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇవాళ ఖరారవుతుంది. కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది.. రానున్న రోజులు మనవే. పార్లమెంట్లో మన గళం వినిపించాల్సిన అవసరం ఉంది. కొందరు నేతలు పార్టీని వీడి వెళ్లినంత మాత్రానా బీఆర్ఎస్కు నష్టం ఏవిూ లేదు అని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతు సమస్యలు అజెండాగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలి. రైతు సమస్యలపై పోస్టుకార్డు ఉద్యమం ఉధృతం చేయాలి. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో లక్ష పోస్టుకార్డులు రాయాలి. రైతుల కల్లాల కాడికి వెళ్లి రూ. 500 బోనస్పై ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రభుత్వ హావిూలను కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయాలి. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. దాన్ని అనుకూలంగా మలుచుకోవాలి అని కేసీఆర్ సూచించారు.బస్సు యాత్రం చేద్దాం.. జనం నుంచి మంచి స్పందన వస్తోందని కేసీఆర్ తెలిపారు. ఈ నెల 22 నుంచి రోడ్డు షోలు నిర్వహిస్తామన్నారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలోని రెండు, మూడు అసెంబ్లీ ఏరియాల్లో రోడ్షోలు ఉంటాయన్నారు. రోజుకు రెండు, మూడు రోడ్షోలు ఉంటాయన్నారు. ఉదయం సమయంలో రైతుల వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. సాయంత్రం వేళ రోడ్డు షోలు, కార్నర్ విూటింగ్స్ నిర్వహించనున్నారు. వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్ సెంటర్లలో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.
