హైదరాబాద్, ఏప్రిల్ 10, (జనతా న్యూస్): తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న తరుణంలో ఇంటర్మీడియట్ బోర్డు అప్డేట్ ఇచ్చింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి ఏప్రిల్ 20 తరువాత విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించారు. ఇందులో 9 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు పరీక్ష రాసిన విద్యార్థులు, రాయనివాళ్లు, మాల్ ప్రాక్టీసుకు పాల్పడిన వాళ్ల సమాచారం నమోదు చేసి, ఆ తరువాత వాల్యూయేషన్లో వచ్చిన మార్కులను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది.మార్కులు ఆన్ లైన్ లో నమోదు అనంతరం…ఓఎంఆర్ షీటు కోడ్ డీకోడ్ చేసి ఫలితాలు సక్రమంగా ఉన్నాయో లేదో అధికారులు ఒకటి రెండు సార్లు చెక్ చేస్తారు. ఈ ప్రక్రియ ముగియగానే ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఏప్రిల్ 21 నాటికి ముగించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఫలితాలను అధికారులే ప్రకటించనున్నారు.
