న్యూఢిల్లీ: భారతదేశ సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. లోక్ సభ తో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది. మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగో విడతలో భాగంగా మే 13వ తేదీన ఏపీలోని 25, తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇదే రోజు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అన్ని ఫలితాలను వెల్లడిస్తారు.
దేశవ్యాప్తంగా మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 19న 102 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. రెండో విడత ఏప్రిల్ 26వ తేదీన 89 స్థానాల్లో, మూడో విడత మే 7న 94 స్థానాల్లో, నాలుగో విడత మే 13న 96 స్థానాల్లో, ఐదో విడత మే 24న 9 స్థానాల్లో, ఆరో విడత మే 25న 57 స్థానాల్లో, ఏడో విడత జూన్ 1న 50 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.
తెలుగు రాష్ట్రాల్లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 18న నోటిఫికేషన్ జారీ కానుంది. ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 26న నామినేషన్లు పరిశీలించి 29 వరకు గడువు ఇస్తారు. మే 13న రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.