- సీజ్ చేసిన వాహనాలను వేలం వేస్తాం
- డీటీసీ పురుషోత్తం
- ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీటీసీ రవాణా శాఖ ఉప కమిషనర్ పెద్దింటి పురుషోత్తం
తిమ్మాపూర్, జనతా న్యూస్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలోని డ్రైవింగ్ ట్రాక్ ను అందుబాటులోకి తీసుకువస్తామని కరీంనగర్ ఉమ్మడి జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ (డీటీసీ) పెద్దింటి పురుషోత్తం తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో గల రవాణా శాఖ కార్యాలయంలో డ్రైవింగ్ ట్రాక్ ను, కార్యాలయంలో పాడుబడ్డ వాహనాలను, వాహన ఫిట్నెస్ రిజిస్ట్రేషన్ చేస్తున్న తీరును ఆయన శుక్రవారం పరిశీలించారు. డ్రైవింగ్ ట్రాక్ పూర్తి అయినప్పటికీ ప్రజలకు ఉపయోగకరంగా లేదని, త్వరలోనే పనులు చేపడతామని తెలిపారు. డ్రైవింగ్ ట్రాక్ విషయమై ఇటీవల మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ను కలిసి రవాణా శాఖ కార్యాలయంలో వృధాగా ఉన్న డ్రైవింగ్ ట్రాక్ పై చర్చించి నిధులు సమకూర్చాలని కోరడం జరిగిందన్నారు. స్పందించిన ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు సమకూర్చే విధంగా కృషి చేస్తానని తెలిపారని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అయితే పనులు చేపట్టి రవాణా శాఖ మంత్రిచే ప్రారంభించే విధంగా చర్యలు చేపడతానని తెలిపారు.
గత కొన్ని ఏళ్లుగా రవాణా శాఖ కార్యాలయంలో ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసిన వాహనాలను వేలం వేసి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తామని కార్యాలయంలో ఉన్నటువంటి సీజ్ చేసిన వాహనాల లిస్టు తయారుచేసి వారం రోజుల్లోగా తనకు అందజేయాలని ఏఎంవిఐ స్రవంతిని ఆదేశించారు. అలాగే కార్యాలయానికి ఫిట్నెస్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చే భారీ వాహనాలకు ఆటోలకు నాణ్యమైన రేడియం స్టీక్కర్లను ముందు వెనకాల వాహనదారులు తప్పకుండా వేయించాలని వాహనదారులకు సూచించారు. ఈ స్టిక్కర్ల వల్ల రాత్రి వేళల్లో జరిగే ప్రమాదాలను జరగకుండా నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవిఐ రవికుమార్, ఏఎంవిఐ స్రవంతి, సిబ్బంది శ్రీనివాస్, రహూఫ్, గౌస్ పాష ఉన్నారు.
