- ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేసే పార్టీలు కావాలా? *
- హామీల అమలు కోసం కొట్లాడే బీజేపీ కావాలా? *
- ప్రజాలారా… తేల్చుకోండి
- మోదీని మళ్లీ ప్రధానిని చేసుకుందాం…
- తెలంగాణకు అధిక నిధులు తెచ్చుకుందాం
- కమలాపూర్ ప్రజాహిత యాత్రలో బండి సంజయ్ వ్యాఖ్యలు
కరీంనగర్, జనతాన్యూస్:ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లో 6 గ్యారంటీల అమలు కోసం పోరాడుతున్న బీజేపీ కావాలా? ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ హామీల అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కావాలా? ప్రజలు తేల్చుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. 6 గ్యారంటీలను అమలు చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రభుత్వంపై వివిధ రూపాల్లో ఒత్తిడి తెస్తూనే ఉంటామన్నారు. ఒకనాడు మేడిగడ్డ సందర్శనకు వెళితే పోలీసులతో అడ్డుకుని కొట్టించిన బీఆర్ఎస్ నేతలకు ఇయాళ అదే గతి పట్టిందని పేర్కొన్న బండి సంజయ్ కాలం ఎవరినీ వదిలిపెట్టబోదనే దానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని అన్నారు.
ప్రజాహిత యాత్రలో భాగంగా ఈరోజు సాయంత్రం హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల కేంద్రానికి విచ్చేసిన బండి సంజయ్ కు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. పూలు చల్లి కొందరు, మంగళహారతి పట్టి మహిళలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీమంత్రి ఈటల రాజేందర్ సోదరుడు ఈటల భద్రయ్య ఆహ్వానం మేరకు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఈటల నివాసానికి వెళ్లిన బండి సంజయ్ తేనీరు సేవించారు. అనంతరం కమాలాపూర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
అందరం బాగుండాలి. అందులో నేనుండాలని భగవంతుడిని ప్రార్ధించండని అన్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి 5 శతాబ్దాల చిరకాల వాంఛను నెరవేర్చిన నరేంద్రమోదీని మళ్లీ ప్రధానిని చేయాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతోపాటు ప్రజా సమస్యలపై బీజేపీ పోరాడిందన్నారు. నాపై వంద కేసులు పెట్టారు. 2సార్లు జైలుకు పంపిన భయపడలేదు.. బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టినా బెదరలేదని గుర్తు చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు.. కాంగ్రెస్ కూడా ఇప్పటికీ ఒక్క కొత్త రేషన్ కార్డు ఇయ్యలేదని తెలిపారు.
మహిళలకు రూ.2500లు, రూ.4 వేల పెన్షన్, రూ.15 వేల రైతు బంధు, రూ.2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, రూ.5 లక్షల నగదు సాయం చేశారా? అని ప్రశ్నించారు..500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ రేషన్ కార్డు ఉన్నవాళ్లకే ఇస్తామంటూ అందులోనే కోత పెట్టిన ఘనత కాంగ్రెస్ దేనని అన్నారు. గ్యాస్ కనెక్షన్ మహిళల పేరిట ఉంటేనే రూ.500లకు సిలిండర్ ఇస్తామంటూ మెలికపెట్టి 50 లక్షల కుటుంబాలకు సబ్సిడీ ఎగ్గొడుతోందని తెలిపారు.
