కరీంనగర్, జనతా న్యూస్ :కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రజల భద్రత దృష్ట్యా తీసుకునే చర్యల్లో భాగంగా మంగళవారం నాడు కరీంనగర్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ ఏసిపి సర్వర్ మాట్లాడుతూ ఈ స్పెషల్ డ్రైవ్ నందు నెంబర్ ప్లేట్లు లేని, ట్యాంపరింగ్ చేయబడిన, రిజిస్ట్రేషన్ కానీ వాహనాలను గుర్తించి వారికి ఈ చలాన్ ద్వారా జరిమానాలు విధించామన్నారు. అంతేకాకుండా వాటికి అప్పటికప్పుడు నెంబరు ప్లేట్లు బిగించేలా చర్యలు చేపట్టామన్నారు. నెంబర్ ప్లేట్లు బిగించినటువంటి వాహనాలను వదిలిపెట్టారు. నెంబర్ ప్లేట్లు లేని వాహనాలతో తిరగకూడదని, కాదని రోడ్లపై ప్రయాణిస్తూ పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలు పాటించడంవల్ల ఇతర వాహనదారులకు సహకరించినట్లే కాకుండా వ్యక్తిగత భద్రత కూడా సాధ్యమవుతుందన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ నందు దాదాపు 75 పైగా ద్విచక్ర వాహనాలను గుర్తించి పట్టుకున్నామన్నారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినటువంటి వాహనదారులని గుర్తించడమే కాకుండా వారికి ఈ చలాన్ ద్వారా జరిమాన కూడా విధిస్తామన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో ఇకపై నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సహకరించాలని కోరారు. ట్రాఫిక్ నియమాలు పాటించకుండా పట్టుబడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేష్, సబ్ ఇన్స్పెక్టర్లు రాజు, సాగర్, శ్రీకాంత్ లతో పాటు ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
