-
కరీంనగర్లో ఊహించని ప్రముఖలు ఓటమి
-
బండి, అర్వింద్, ఈటెల ఓటమితో పార్టీకి దెబ్బ
కరీంనగర్ ప్రతినిధి (జనతా న్యూస్) : తెలంగాణలో ఎన్నికల ఫలితాలు బిజెపిని నిరాశకు గురిచేసి వుంటాయి. కరీంనగర్లో బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటెల రాజేందర్లు ఓటమి చెందడం పార్టీకి మింగుడ పడని ప్రశ్నగా మారింది. కరీంనగర్ టౌన్లో బండి సంజయ్, కోరుట్లలో ధర్మపురి అర్వింద్, హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ల ఓటమి పార్టీకి కోలుకోలేని దెబ్బగా భావించాలి. ఆదిలాబాద్లో చూపిన పర్రభావం కరీంనగర్లో చూపలేకపోయారు. బిజెపి పట్ల ప్రజల్లో వస్తున్న ఆదరణను అందిపుచ్చు కోకపోవడం కూడా ఓ కారణంగా చెప్పుకోవాలి. బండిని మార్చిన తరవాత జిల్లాలో పార్టీకి కూడా డౌన్ఫాల్ అయ్యిందన్న విమర్వలు ఉన్నాయి. అయినా తమ స్వయంకృతం అన్న విషయం గుర్తించి అందుకు తగిన విధంగా కార్యాచరణ చేస్తుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే బండి సంజయ్ను తొలగించిన కారణంగా ఆయన కూడా ఓడిపోయారు. పార్టీలో ఉవ్వెత్తున ఎదిగిన నేతను పక్కన పెట్టడంతో జనంలో కూడా పలచబడ్డాడు. బిజెపిలో బండికి విలువ లేదన్న ప్రచారం సాగింది. ఆయనకు జాతీయ ప్రధానకార్యదర్శి పదవిని అప్పగించినా కరీంనగర్లో జనం మాత్రం పట్టించుకోలేదు. బిజెపి అధ్యక్షుడి మార్పు తరవాత వస్తున్న విమర్శలను తిప్పికొట్టడంతో పాటు…బిఆర్ఎస్తో ఎలాంటి ఒప్పందం లేదని చెప్పుకోవడానికి బిజెపి నానా తంటాలు పడ్డా ప్రజలు నమ్మలేదని ఎన్నికల ఫలితాలు తేల్చాయి.
బండి సంజయ్ను మార్చడం అన్న ఏకైక నిర్ణయంతో బిజెపి ఓ రకంగా ఆత్మరక్షణలో పడిరదనే చెప్పాలి. బిజెపిని అధికారంలోకి తీసుకుని వస్తామన్న బలమైన నమ్మిక ఉంటే బండిని ఎందుకు మార్చారన్న సామాన్యుల,బిజెపి కార్యకర్తల ప్రశ్నలకు సరైన సమాధానం రాలేదు. సీఎం కేసీఆర్ రాజకీయ ట్రాప్లో పడవద్దని.. కేసీఆర్తో మనకు ఎలాంటి స్నేహమూ లేద బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికలకు ముందు రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలకు చేసిన సూచనలు నమ్మదగినవిగా లేవని ప్రచారంలో ప్రజలు గమనించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించడం, బండిని తొలగించడం ఎందుకన్న విషయాలపై మాత్రం స్పష్టత రాలేదు. వీటికి సమాధానం కూడా బిజెపి వద్ద లేదు. పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలని చెబుతున్న మోడీ కావచ్చు..అమిత్ షా కవాచ్చు..నడ్డా కావచ్చు..ఎవరు కూడా దూకుడువిూదున్న బండిని ఎందుకు తప్పించారన్నది శేషప్రశ్నగానే ఉండి పోయింది. పార్టీలో మార్పులు చేర్పులు కావచ్చు… ప్రధాని మోడీ పర్యటన, నడ్డా పర్యటన అంతకు ముందు అమిత్ షా పర్యటన అంతా గందరగోళంగా సాగింది. ఇకపోతే..దక్షిణాదిలో కర్నాటకను చేజార్చుకున్నారు. దాంతో మేల్కొని పార్టీని బలోపేతంగా ముందుకు తీసుకుని వెళ్లాల్సిన క్రమంలో పిల్లిమొగ్గలు ఎందుకు వేస్తున్నారన్నదే ప్రశ్న.
వీరి లక్ష్యం స్పష్టంగా లేదన్న నిజాన్ని ప్రజలు తెలుసుకుని ప్రశ్నిస్తున్నా .. భిన్న సంకేతాలిస్తూ ప్రజలలో గందరగోళం పెంచుతున్నాయి. ఇకపోతే మార్పులు చేర్పులు అటుంచితే ప్రజల సమస్యలపై దృష్టి సారించి వాటిని పరిష్కరించకుండా ఎన్నికల్లో గెలవాలి..లేదా గెలుస్తామన్న ధీమా ఆత్మవంచనే అవుతుంది. తెలంగాణలో తాము అధికారంలోకి రాబోతున్నామని హడావుడి చేసిన బిజెపి బండిని తప్పించడం ద్వారా ముందుగానే చేతులెత్తేయడంతో ఈ అనుమానాలు బలపడ్డాయి. ఇదే కారణంగా కరంనీరగ్లో బండి సంజయ్ను ఓడిరచారని అనుకోవచ్చు. బండి బిజెపి అధ్యక్షుడయ్యాక పార్టీని ఉన్నతస్థాయి తీసుకుని వెళ్లడంలో బండి కృషి చేశారు.
ఇతర పార్టీల్లో ఉన్న నేతలంతా వచ్చి బిజెపిలో చేరారు. దుబ్బాక, జిహెచ్ఎంసి, హుజూరాబాద్ ఎన్నికలలో విజయాలు సాధించాక బలపడ్డామని విర్రవీగారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్ను దూరం పెట్టారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు నిరసన స్వరం పెంచారు. బిజెపి మాయలో పడి కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ అసెంబ్లీకి రాజీనామా చేసి మునుగోడులో భంగపడ్డారు. బిజెపిది వాపే కాని బలుపు కాదని తెలుసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో బిజెపి ఒక్క సీటును మాత్రమే గెల్చుకుంది. అదికూడా రాజాసింగ్దే కావడం గమనార్హం.లిక్కర్ కేసులో కవితనే గాక అవినీతి కేసుల్లో కెసిఆర్ను కూడా అరెస్టు చేస్తామన్న స్థాయిలో బండి సంజయ్ తదితరులు రెచ్చిపోయి మాట్లాడారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. లిక్కర్ కేసులో కవిత పాత్ర ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేదన్న ప్రచారం బాగా జరిగింది. బండిని ఎందుకు అకారణంగా తొలగించారు. వీటికి బిజెపి సమాధానం చెప్పే స్థితిలో లేదు.
ఇదే క్రమంలో బిజెపిపై కెసిఆర్ విమర్శల తీవ్రత తగ్గిందనే అభిప్రాయం కూడా పెరిగింది. బిఆర్ఎస్ నుంచి నిష్కమ్రించిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి వంటివారు కూడా కాంగ్రెస్ లోనే చేరడం బిజెపికి మరీ ఇబ్బందికరంగా మారింది. కెసిఆర్ కూడా తమకు రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ తప్ప బిజెపి కాదని పలుసార్లు ప్రకటించారు.మొత్తంగా బిజెపి తీరు వల్ల ప్రధాన నేతలే ఓటమి పాలయ్యారు. కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటెల రాజేందర్ల ఓటమి ఇందుకు నిదర్శనంగా చూడాలి.