కరీంనగర్, జనతాన్యూస్ : కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ విజయభేరి యాత్రతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. పెద్దపల్లిలో నిర్వహించిన సభ ముగిసిన తరువాతర కరీంనగర్ లోకి సాయంత్రం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జనం బ్రహ్మరథం పట్టారు. నగరంలో ఆయన పాదయాత్ర చేయగా ఆయన వెంట యువకులు, పార్టీ శ్రేణులు భారీగా నడిచారు. చిరునవ్వులు చిందిస్తూ.. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా కరీంనగర్ లోని రాజీవ్ చౌక్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆ తరువాత వీ పార్క్ లో బస చేశారు.
విజయభేరి యాత్రలో భాగంగా శుక్రవారం రాహుల్ గాంధీ 9.30 గంటలకు కొండగట్టు అంజన్నను దర్శించుకోవాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ పర్యటన రద్దయింది. దీంతో రాహుల్ గాంధీ నేరుగా 11 గంటలకు జగిత్యాలకు చేరుకొని అక్కడ కార్నర్ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటకు వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి వద్ద పార్టీ నాయకులను కలుసుకుంటారు. ఒంటిగంటకు కోరుట్లలో ప్రజలను కలుస్తారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు రాహుల్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేశారు.