బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్పై ఎఫ్ఐఆర్..
జడ్పీ సీఈవో శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు
ఎమ్మెల్యేకు కాంగ్రెస్ జడ్పీటీసీ 48 గంటల డెడ్లైన్
ప్రాణ భయం ఉందంటూ టౌన్ ఏసీపీకి ఫిర్యాదు
కరీంనగర్-జనత న్యూస్
‘‘ నిన్న జిల్లా పరిషత్లో జరిగిన రచ్చ..నేడు రెండో రోజు పరస్ఫర ఫిర్యాదులు, ఆందోళనలతో కొనసాగింది. జడ్పీ సీఈవో ఫిర్యాదుతో ఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై వన్టౌన్ పీఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా..కాంగ్రెస్ జడ్పీఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ ప్రాణ భయముందంటూ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కౌశిక్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రతిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి నాయకులతో కలసి సీపీ అభిషేక్ మహంతిని కలసి జడ్పీ సీఈవోపై ఫిర్యాదు చేశారు. జడ్పీ సమావేశంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతారా..? అంటూ మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు.’’
కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశ సర్వసభ్య సమావేశంలో జరిగిన రచ్చ, ఇరు పార్టీల మధ్య వార్..ఇప్పటిల్లో ముగిసేలా లేదు. ఈ గొడవ మరికాస్త ముదిరింది. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ వరకు వెళ్లింది. మరో కేసు కూడా నమోదయ్యేలా ఉంది. జడ్పీ సీఈవో శ్రీనివాస్ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఆయనపై భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ 221, 226 (2) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు . నిన్న జిల్లా పరిషత్ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి బయటకు వెళ్లే క్రమంలో బీఆర్ఎస్ సభ్యులతో కలసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకుని బ్కెఠాయించిన విషయం తెలిసిందే. విధులకు ఆటకం కలిగించినందుకు ఎమ్మెల్యేపై కేసు నమోదైనట్లు తెలుస్తుంది. బీఎన్ఎస్ చట్టం అమలు అయిన రెండో రోజే హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు కావడం విశేషం.
బీసీ సంఘాల ఆందోళనలు
జడ్పీ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ చేసిన వ్యాఖ్యలపై బీసీ సంఘాల ఆందోళన చేపట్టాయి. బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌరస్తాలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా ఆ సంఘ ప్రతినిధులు వెంటనే పాడి కౌశిక్ రెడ్డికి పలు హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే క్షమాపన చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్రంలో ఎక్కడా తిరుగనివ్వబోమని హెచ్చరించారు.
టౌన్ ఏసీపీకి ఫిర్యాదు
తనకు హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో ప్రాణ భయం ఉందని జడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు . కరీంనగర్లో టౌన్ ఏసీపీ నరేందర్కు కాంగ్రెస్ నాయకులతో కలసి ఆయన ఫిర్యాదు చేశారు. జడ్పీ సమావేశంలో పరుష పదజాలాలతో దూషించడంతో పాటు చంపుతా నని బెదిరించారని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు రక్షణ కల్పించడంతో పాటు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. అంతకు ముందు కరీంనగర్ ప్రెస్ భవన్లో బీసీ సంఘాల ప్రతినిధులతో కలసి గీకురు రవీందర్ మీడియాతో మాట్లాడారు . అణగారిన వర్గాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్కసు చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. 48 గంటల్లో బహిరంగ క్షమాపన చెప్పాలని, లేని పక్షంలో ఎక్కడి కక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి చేసిన రచ్చపై కేసీఆర్ స్పందించి బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.